బైక్పై వెంటాడి ఆటోడ్రైవర్ను పట్టుకున్న యువకుడు
మనతెలంగాణ, హైదరాబాద్ : చైన్ స్నాచింగ్ చేసిన దొంగను బైక్పై చేధించి పట్టుకున్న యువకుడిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సన్మానించారు. ఈ నెల 4వ తేదీన ఆర్సి పురానికి చెందిన గణేష్ యాదవ్(24) సండే మార్కెట్కు వచ్చాడు. అదే సమయంలో తన సమీపంలో ఓ ఆటోలో మహిళ వచ్చింది. మార్కెట్ చాలా మందితో అత్యంత రద్ధీగా ఉంది.ఐదు సెకన్ల తర్వాత మహిళ తన మెడలోని గొలుసుకును కొట్టేసినట్లు తెలుసుకుని ఆందోళనకు గురైంది. అక్కడే ఉన్న గణేష్ మహిళను విషయం అడిగాడు. వెంటనే ఆటో డ్రైవర్పై అనుమానం వ్యక్తం చేసి బైక్పై ఆటోను అనుసరించాడు. ఇక్రీసాట్ జంక్షన్ వద్ద ఆటో ముందు బైక్ను నిలపడంతో ఆటో డ్రైవర్ ఆపివేశాడు.
చైన్ ఎక్కడ అని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం చెప్పాడు. యువకుడు ఆటోను తనిఖీ చేయగా సీటు కింద ఉన్న చైన్ను కనిపెట్టాడు. అప్పటికే మహిళ కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమయానికి స్పందించిన యువకుడిని పోలీసులు అభినందించారు. యువకులు తమ చుట్టూ జరుగుతున్న అక్రమాలు, నేరాల గురించి పోలీసులకు సమాచారం అందజేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కోరారు. పోలీసులు, యువత కలిసి పనిచేస్తే శాంతిభద్రతలను అదుపులో పెట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో మియాపూర్ ఎసిపి కృష్ణ ప్రసాద్, డిఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.