Saturday, May 4, 2024

బాధిత మహిళలకు సాంత్వన కల్పించేందుకు సఖి సెంటర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: బాధిత మహిళలకు సాంత్వన కల్పించేందుకు వాన్ స్టాఫ్ సఖి సెంటర్ ద్వారా అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం రోజున పట్టణంలోని ధరూర్ క్యాంపు సమీపంలో నూతనంగా నిర్మించిన సఖి కేంద్రా భవనాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి కేంద్రంలోని పలు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళల ప్రతీ సమస్య కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చూపడానికి సఖి కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు. సఖి కేంద్రం సేవల వివరాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు, గ్రామీణ ప్రాంత మహిళా ఉద్యోగులకు సఖి కేంద్రం ద్వారా అందించే న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ సేవల వివరాలను తెలియజేయాలని అన్నారు.

సామాజిక బాధ్యతతో సాటి మహిళలకు సహకారం అందించాలని సఖి కేంద్రంలో పని చేసే ఉద్యోగులను కోరారు. సఖి కేంద్రానికి ప్రహారి గోడ నిర్మించేందుకు నిధులు సమకూర్చుతామని, సెక్యూరిటి కల్పనకు ఎస్.పి. చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ మహిళలకు రక్షణ, భరోసా కల్పించేందుకు సఖి వాన్ స్టాఫ్ కేంద్రం దోహదపడుతుందని అన్నారు. 5 రకాల సేవలు అందించే వివరాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, మహిళల చట్టాలపై అవగాహన కల్పించాలని సుమారు 68 వేల మందికి పైగా సఖి కేంద్రం సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సఖి కేంద్రం ద్వారా అందించే సేవలను బాధిత మహిళలు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ మహిళలపై పలు ప్రాంతాలలో జరిగిన లైంగిక వేధింపుల నేపథ్యంలో నిర్భయ చట్టం అమలులోకి రావడం జరిగిందని అన్నారు. 2019 ఏప్రిల్ లో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలోని బాధిత మహిళలకు కౌన్సిలింగ్, వైద్య సేవలు, న్యాయ సహకారం, పోలీసుల సహకారం అందించడం జరుగుతుందని, బాధితురాలికి 5 రోజుల పాటు షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. స్వచ్చంధ సంస్థల సహకారంతో సఖి కేంద్రాలు నిర్వహిస్తారని అన్నారు. దోషికి శిక్ష పడే విధంగా న్యాయ సహకారం సఖి కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని, పోలీసుల రక్షణ కల్పించడంతో పాటు వైద్య సెలవు అందించడం జరుగుతుందని అన్నారు. మహిళల చట్టాలపై స్వయం సహాయక సంఘాలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు, పనిచేసే చోట మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు.

ఎస్పి భాస్కర్ మాట్లాడుతూ బాధితురాలికి చట్ట పరంగా సహకారం అందించేందుకు సఖి కేంద్రం పనిచేస్తుందని, అదే విధంగా భరోసా కేంద్రాల ద్వారా కూడా సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ వేధింపులకు గురైన మహిళలకు సఖీ కేంద్రం సేవలందిస్తుందని అన్నారు. కేంద్రం ద్వారా సహకారం పొందిన మహిళలు వారి జీవితాన్ని విజయవంతంగా భవిష్యత్ ప్రణాళికలతో కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీలత, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, ప్రకృతి స్వచ్చంధ సంస్థ ప్రతినిధి జయ శ్రీ, సఖి కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది, అంగన్ వాడీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News