Tuesday, April 30, 2024

సమ్మె విరమించండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీతో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత వరకూ త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పారిశుద్ధ్య కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

గత ప్రభుత్వాలలో రూ.500, రూ.1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అడగకుండానే ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.8,500కు పెంచారన్నారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే రూ.8,500 నుంచి రూ.9,500కు పెంచిన మనసున్న మనిషి కెసిఆర్ అని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కనీసం మనుషులుగా కూడా ఆ ప్రభుత్వాలు చూడట్లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.5,200, ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,200 ఇస్తున్నారని వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం అసలు వేతనమే ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని చెప్పారు. ఒడిశాలో ఇంటికి రూ.5 మాత్రమే ఇస్తున్నారని, పశ్చిమ బెంగాల్‌లో అయితే ‘పెయిడ్ వర్కర్స్’ అని పెట్టి నెలకు రూ.500 మాత్రమే ఇస్తున్నారని, కేరళ శానిటేషన్ వర్కర్లు అని పెట్టి ఇంటికి కేవలం రూ.30 ఇస్తున్నారని వెల్లడించారు.

అంటే ఒక కార్డులో పనిచేస్తే కనీసం రూ.4 నుంచి 5 వేలు కూడా రాని పరిస్థితి ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. దేశమంతా ఇలాంటి పరిస్థితులు ఉంటే మన ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకుని మన పల్లెలు, పట్టణాలను దేశానికే ఆదర్శంగా నిలిచేటట్లు చేశారని గుర్తుచేశారు. ఈ విజయంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర మరువలేనిదని తెలిపారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా గౌరవంగా చూస్తుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, సమ్మె విరమించి విధుల్లో చేరాలని పారిశుద్ధ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని కార్మికులను ఆయన కోరారు. క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తింపు ఇవ్వాలని పారిశుద్ధ కార్మికులు కోరినట్లు, దాన్ని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News