కటక్ః క్యారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ యువతిపై స్థానిక సర్పంచ్ వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిసాలోని సువర్ణపూర్ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో చోటుచేసుకుంది. కరోనా కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం వారివారి సొంత రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు నుంచి సొంత రాష్ట్రానికి వచ్చిన కొంతమంది వలస కార్మికులను సువర్ణపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే, డుంగురిపల్లి సమితి అందారిబంచిలోని క్యారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ యువతి తనను స్థానిక సర్పంచ్ వేధిస్తున్నాడని, రాత్రిపూట మద్యం తాగివచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని క్వారంటైన్ నర్వాహకులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో జరిగిన ఘటనను వివరిస్తూ తనకు న్యాయం చేయాలని బాధిత యువతి సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. దీంతో వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Sarpanch sexually harassed on quarantine Girl in Odisha