Tuesday, March 19, 2024

రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తే మేలు…

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎన్నికల తరువాత ప్రధాని ఎవరు? అనే విషయాన్ని పక్కకుపెట్టి ప్రతిపక్ష ఐక్యత కోసం పాటుపడితే బిజెపి ఓటమి ఖాయం అవుతుందని ఉద్ధవ్ థాకరే శివసేన అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష నేతలు ముందు తాము దేశానికి ప్రధాని అవుతామనే ధోరణిని పక్కకు పెట్టాల్సి ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు చాలా ముందుగానే దేశంలో విపక్ష ఐక్యతపై స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇది కేవలం చర్చలు, భేటీలు పర్యటనలతోనే సరిపోదని శివసేన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం వెలువరించారు.

ప్రధాన విపక్ష నేతలు ఎవరికి వారు తామే భావి ప్రధాని అని భావించుకునే అహం వీడాల్సి ఉందని , ముందు ఏకతాటిపైకి రావడం ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని శివసేన స్పష్టం చేసింది. ముందు ఐక్యత సంగతి చూడండి, తరువాత ప్రధాని ఎవరనేది తేల్చుకోవచ్చు అని శివసేన సూచించింది. ఈ సంపాదకీయంలో శివసేన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశంసించింది. రాహుల్ ఓపికను తీరుతెన్నులను ప్రజలు కొనియాడుతున్నారని తెలిపింది. ఇది ఆరంభం అయిందని, క్రమేపీ విస్తృతం అవుతుందని అభిప్రాయపడింది. ప్రధాని మోడీకి నెహ్రూ గాంధీ ఖాన్‌దాన్ వ్యక్తి సరితూగడనే ఆలోచనా విధానం నుంచి అంతా బయటపడితే మంచిదని , ఏదో ఒక దశలో విపక్ష నేతలు పూర్తిస్థాయి వాస్తవికతతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో రాబోయే మార్పులకు సంకేతం అవుతాయని , మధ్యప్రదేశ్‌లో బిజెపి ఓడిపోతుందని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని విశ్లేషించారు. రాజకీయ మాంత్రికుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ రాష్ట్రంలో కాషాయ పార్టీకి చుక్కలు చూపుతారని సామ్నాలో చురకలు పెట్టారు. రాహుల్ మోడీకి సరితూగే వ్యక్తి కాదనే భ్రమలు వీడితే మంచిదని, నిజానికి ఇప్పుడు ప్రధాని మోడీకి కూడా రాహుల్ భయం పట్టుకుందని , ఆ కుటుంబం నుంచి తనకు గట్టి సవాలు ఏర్పడుతుందని ఆయనే స్వయంగా భావిస్తున్నారని, ఈ వాస్తవం అంతా గ్రహిస్తే మంచిదని సామ్నా సూచించింది. ఉత్తరభారతదేశంలో రాహుల్ గాంధీ సొంతంగా ప్రచార బాధ్యతలు తీసుకుని తిరిగితే అక్కడ కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయని విశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News