Friday, April 26, 2024

రంగంలోకి ‘సిట్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. కేసును నిగ్గు తేల్చేందుకు మంగళవారం నాడు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను ఏర్పాటు చేసి, దానికి ఎఆర్ శ్రీనివాస్‌ను చీఫ్‌గా నియమించింది. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన రంగంలోకి దిగారు. పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాపు చేస్తున్నట్లు వెల్లడించారు. పేపర్ లీకేజ్‌లకు సంబంధించిన వివరాలను బేగంబజార్ పోలీసుల నుంచి సేకరించారు. పేపర్ లీక్ కేసులో ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. ఇప్పటివరకు పేపర్ ఇద్దరికి లీకైనట్లు మాత్రమే గుర్తించామన్నారు. నిందితుల సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూ టర్లను ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలనకు పంపామని తెలిపారు. వాటి నివేదిక వచ్చిన వెంటనే దర్యాప్తులో మరింత పురోగతి ఉంటుందని పేర్కొ న్నారు.

అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యా ప్తు బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం సిసిఎస్ పోలీసులకు అప్ప గించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు బాధ్యతలను సిసిఎస్ సిట్ బృందానికి బదలాయిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ అంతకుముందు ఆదేశాలు జారీ చేశారు. ఎఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. అసిస్టెంట్
ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టు ఈ నెల 13న ఫిర్యాదు నమోదైందని, సెక్షన్ 409, 420, 120(బి)తో పాటు ఐటి చట్టంలోని 66సి, 66బి, 70 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు వెల్లడించింది.

ప్రవీణ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

నిందితుడు ప్రవీణ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు పోలీసులు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చే చాలామందితో ప్రవీణ్ సంబంధాలు పెట్టుకున్నాడు. అతని సెల్‌లో పలువురు మహిళల కాంటాకట్స్ వున్నట్లుగా పోలీసులు తెలిపారు. కాన్ఫిడెన్షియల్ గదికి సెక్రటరీ వెళ్లినప్పుడు.. ఐపీ, యూజర్ ఐడీ దొంగిలించాడు ప్రవీణ్. అనంతరం ఏఈ ప్రశ్నాప్రత్రాన్ని రాజశేఖర్‌తో కలిసి పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీని గురించి రేణుక దంపతులతో చర్చించిన ప్రవీణ్ ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.20 లక్షల వసూలు చేయాలని.. అందులో రూ.10 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ తీసి రేణుక దంపతులకు ఇచ్చాడు. దీంతో వారు వాళ్ల కమ్యూనిటీలో పేపర్ వుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్ధులు నీలేష్, గోపాల్‌లు ప్రశ్నాపత్రం కొనేందుకు ముందుకు వచ్చారు.
పరీక్షకు మూడు రోజుల ముందు వీరిద్దరిని తన ఇంట్లోనే వుంచి ప్రిపేర్ చేయించారు. అలాగే పరీక్షా పత్రం లీకేజ్ గురించి బయటకు తెలియకుండా రేణుక దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్ధులను కారులో సరూర్ నగర్‌లోని సెంటర్‌లో వదిలిపెట్టారు రేణుక దంపతులు. పోలీసులు విచారణలో నిందితులంతా తమ నేరాన్ని అంగీకరించారు.

నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్..

అయితే ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, ఏ3 నిందితురాలు రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. దీనికంటే ముందుగా 9 మంది నిందితులను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

పేపర్ లీక్‌పై గవర్నర్ ఆరా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ మేరకు టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శికి రాజ్‌భవన్ నుంచి లేఖ వెళ్లింది. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసలైన అభ్యర్ధుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News