Saturday, April 27, 2024

తాళం వేసిన ఇంట్లో చోరీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన నిందితులను నార్సింగి, రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 16తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, యాక్టివా మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా, మక్తల్, చిన్నపొర్లకు చెందిన చాపల అంజప్ప అలియాస్ అంజలప్ప బార్కాస్‌లో చేపలు విక్రయిస్తుంటాడు. చార్మినార్‌కు చెందిన సోహైల్ అలీ అలియాస్ స్టాండర్ వాటర్ సప్లై చేస్తుంటాడు. వ్యసనాలకు బానిసలుగా మారి ఇద్దరు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు.

ఇద్దరిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పిడి యాక్ట్ పెట్టగా జైలు నుంచి సోహైల్ ఇటీవలి కాలంలోనే విడుదలయ్యాడు. ఇద్దరు నిందితులు గురువారం రాత్రి అలకాపూరి టౌన్‌షిప్, నెక్నంపూర్ గ్రామంలోని విక్రం రావు ఇంట్లో చోరీ చేసి బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు చోరీ చేశారు. వేసవి సెలవులు రావడంతో విక్రం రావు కుటుంబంతోపాటు 15 రోజుల క్రితం నార్త్ ఇండియాకు టూర్‌కు వెళ్లాడు. విక్రం రావు ఇంట్లో చోరీ జరిగిన విషయం ఇంటి పక్కన ఉన్నవారు చెప్పడంతో అతడి తోడల్లుడు లక్ష్మణ్ రావుకు విక్రం రావు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఇంటికి వెళ్లిన లక్ష్మణ్‌రావు లాకర్, కప్‌బోర్డును పరిశీలించగా బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు.

వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితులు పాతబస్తీ వైపు వెళ్లి నట్లు గుర్తించారు. దాని ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులను డిసిపి అభినందించారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News