Friday, April 26, 2024

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హనుమకొండటౌన్ : హనుమకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి బుధవారం జరిగిన ఫస్టియర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లగా.. జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంది.

బుధవారం పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పేరెంట్స్ వస్తే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది.
కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లనేనా..?
ఇంటర్ ఫస్టియర్‌లో మా కళాశాల నుండి మంచి ర్యాంకులు సాధించాలనే తపనతో కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఈఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఏంచేయాలో అర్థం కాక చివరకు మరణమే శాసనంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజలను అనుకోవడం జరుగుతుంది. వారి కళాశాలలో టాప్ ర్యాంకుల్లో నిలించేందుకు ఇలా విద్యార్థుల జీవితాలతో ప్రైవేటు విద్యాసంస్థలు చెలగాటమాడుతున్నాయని ప్రజలు అంటున్నారు.
కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లే విద్యార్థిని ఆత్మహత్య
విద్యార్థి సంఘాల నాయకులు
విద్యార్థిని నాగజ్యోతి కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను వారి కళాశాల టాప్ ర్యాంకు సాధించేందుకు విద్యార్థులను బలి పశువులు చేసి ఆడుకుంటున్నారని వారి కళాశాల పేరు, ప్రఖ్యాతలు పొందేందుకే ఇలా విద్యార్థులపై ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతుందని, ఈఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. వరంగల్, హనుమకొండ నగరంలో ప్రైవేటు కళాశాలలో ఒకదాని వెనుకాల ఒకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, విద్యారంగాన్ని అంతా వ్యాపారంగా మారుస్తూ కొందరు చదువును వ్యాపారం చేసుకుని సొమ్మును పోగు చేసుకుంటున్నారన్నారు.

అంతేకాకుండా హనుమకొండలో ఉన్నటువంటి కొన్ని కళాశాలలకు, పాఠశాలలకు పర్మిషన్లు లేకుండా నడుపుతున్నారన్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సువిద్య కళాశాల వారి యాజమాన్యమే కారణమని కళాశాల పర్మిషన్ రద్దు చేసి విద్యార్థిని తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News