Sunday, April 28, 2024

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అధికారాల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ క్రమం లోనే ఈ పిటిషన్‌పై తమ వైఖరిని తెలపాలని కోరుతూఏ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ఈ పిటిషన్‌ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 17 కు వాయిదా వేసింది. ఐఎఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీం కోర్టు గతంలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

అయితే ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. కానీ ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది. దీన్ని కార్య నిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా, ఆరోపిస్తోంది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్ దూరం చేస్తుందని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమం లోనే ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతోపాటు దానిపై మధ్యంతర స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. ఆర్డినెన్స్‌పై పోరులో భాగంగా కేజ్రీవాల్ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే.

Also Read: హిమాచల్‌లో భారీ వర్షాలు: చిక్కుకుపోయిన వందలాది పర్యాటకులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News