Sunday, April 28, 2024

ఇక వాట్సాప్..సోషల్ మీడియాతోనే… పార్టీని రక్షించుకునేందుకు టి టిడిపి ప్లాన్

- Advertisement -
- Advertisement -

మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ?
అటు ఏపి రాజకీయాలపై చంద్రబాబుతో జనసేనానీ మంతనాలు
హైకోర్డు నిబంధనలు పాటిస్తూనే చాపకింద నీరులా వ్వూహాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడంతో పార్టీని వీడిపోతున్న క్యాడర్‌ను రక్షించుకునేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కాసాని పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం, అంతకు కొద్ది రోజుల ముందే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి కూడా అదేదారిలో పయనించడంతో టిడిపి అప్రమత్తం అయింది. ఇప్పటికే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపి సర్కార్ పలు కేసులు ఇరికించి ఆయన్ను జైలుకు తరలించడంతో ఆ కేసును ఎదుర్కొనేందుకే ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు సతమతమవుతున్నారు. దీనికి తోడు సిబిఐ, హైకోర్టు ద్వారా ఓ 50 నిబంధలు పాటించే పరిస్థితి నెలకొనడంతో ఆయన ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇదే సందర్భంలో జైలులో తనను పరామర్శించేందుకు వచ్చిన కాసానికి చెప్పినా ఆయన వినకుండా పార్టీని వీడి పోయారు. తాజాగా ఆరోగ్య కారణాలతో షరతులతో కూడాని బెయిల్ తీసుకుని రాజమహేంద్రవరం జైలు నుండి బయటకు వచ్చి హైదరాబాద్‌లో వైద్య చికిత్సలు చేసుకుంటున్న చంద్రబాబు అదే సమయంలో పార్టీని బతికించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఒక పక్క తెలంగాణలో పార్టీని బతికించుకోవడంతో పాటు ఏపిలో జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతానికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోయినప్పటికీ .. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేద్దామని ఆయన పార్టీ క్యాడర్‌కు హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో పని చేసిన పార్టీ అని, క్యాడర్‌ను రక్షించుకునేందుకు తనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉంటారని ఆయన భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం కోటి మందికి పైగానే టి టిడిపి సభ్యత్వం ఉందని, వీరంతా ఎన్‌టిఆర్ ఆశయాలను కొనసాగిస్తూ బడుగు, బలహీన వర్గాల రక్షణ, భద్రతకు మద్దతుగా ఉంటారని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ కేడర్‌కు సూచిస్తున్నారు.
వాట్సాప్..సోషల్ మీడియాతో…
ఎన్నికల్లో పోటీ చేయక పోవడంతో అసంతృప్తితో ఉన్న తెలంగాణ పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలుస్తున్నారు. తాను మీడియా ముఖంగా మాట్లాడే పరిస్థితి లేదని, ఈ క్రమంలో వాట్సప్, సోషల్ మీడియ ద్వారా కలుసుకుందామని ఆయన భరోసానిస్తున్నారు. తాను బెయిలుపై బయటికి వచ్చినప్పటి నుండి అటు ఏపిలో అధికార పార్టీ నేతలు తనపై ఎన్నో విమర్శలు చేస్తున్నా.. వాటి జోళికి వెళ్లకుండా పార్టీ క్యాడర్‌ను రక్షించుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆయన పార్టీ నేతలు, ఆంతరంగికులతో చెబుతున్నారు. తమ పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా వాటి జోళికి వెళ్లవద్దని కూడా మరో వైపు పార్టీ ఏపి నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం.
మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్‌కు మద్దతు …
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయక పోయినప్పటికీ అధికార పార్టీని నిలువరించేందుకు మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని టి టిడిపి నేతలు ఇంత వరకు ఎవరు ఖండించక పోవడంతో ఈ విషయం వాస్తవమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ బిఆర్‌ఎస్‌ను ఢీకొనాలంటే ఏ ఒక్క పార్టీ తరం కూడా కావడం లేదు. ఇప్పటికే ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెట్టి సిఎం కెసిఆర్ దూసుకెళ్తుండడంతో ఆయన్ను నిలువరించడం ఎవరితరం కూడా కావడం లేదు. వరుసగా రెండు సార్లు గెలిచిన బిఆర్‌ఎస్ మూడో సారి కూడా హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలో తాము పోటీ చేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ ఓట్లు చీలకుండా అవన్నీ కాంగ్రెస్ పార్టీకే పడేలా చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాల టాక్. ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా ఆయన టిడిపి నుండి వెళ్లిన వారేనని.. పార్టీలో ఉన్నప్పటి నుండి తన చెప్పినట్లు నడుచుకున్న నాయకుడే కావడంతో రేవంత్ ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే టిడిపి ఓట్లు పడేలా చూడాలని టిడిపి బాస్ భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ విషయంలో ఏది చేసినా మూడో కంటికి తెలయకుండానే చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News