శ్రీనగర్: ఓ ఉపాధ్యాయుడు తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి 1000 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్ష్మిపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేవ్ చెందిన ఆశిష్ కేర్ అనే వ్యక్తి శ్రీనగర్లోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీనగర్లోనే ఉండిపోయాడు. ఏప్రిల్ 18న ఆశిష్ కేర్ తండ్రి క్యాన్సర్ వ్యాధితో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తెలిపారు. నాలుగు రాష్ట్రాలు దాటి తన తండ్రి అంత్యక్రియలలో ఎలా పాల్గొనాలని ఆలోచించాడు. అందరూ బంధువులు తన తండ్రి మృతదేహాన్ని చూడటానికి వస్తున్నారు. తన తండ్రిని చివరసారిగా చూస్తానో లేదోనని బాధతో ఆ టీచర్ కుమిలిపోతున్నాడు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్లో చిక్కుకపోయిన యుపి వలస కూలీలను యుపి ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఉత్తర ప్రదేశ్ హెల్ప్లైన్ నంబర్కు ఆ టీచర్ ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి తనకు పాస్ కావాలని అభ్యర్థించాడు. వెంటనే సిఇఒ నరేంద్ర భూషణ్ జమ్ము కశ్మీర్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి పాస్ ఇప్పించాడు. ఉపాధ్యాయుడు 1000 కిలో మీటర్లు ప్రయాణించి ఏప్రిల్ 19న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నాడు. తనకు పాస్ ఇప్పించిన యుపి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.