Sunday, April 28, 2024

తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేదని, దాన్ని తిరగరాసిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని పేర్కొన్నారు.

ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సిఎం కెసిఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నదని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో తనకూ భాగస్వామ్యం కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు మంత్రి హరీశ్‌రావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభ ప్రసంగంతో సమావేశం ప్రారంభం కాగా, అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రసంగించారు. సిఎం కెసిఆర్ సందేశంతో సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సిఎం ఒఎస్‌డి డాక్టర్ గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైఎస్ ఛాన్స్‌లర్ కరుణాకర్ రెడ్డి,టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపిలు దామెదర్ రావు, రాములు,కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధునూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎంఎల్‌ఎలు రేగాకాంతారావు, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News