Thursday, April 25, 2024

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ

- Advertisement -
- Advertisement -

భద్రాచలం : సుధీర్ఘ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా మనం తెలంగాణ సాధించుకొని 9వసంతాలు పూర్తి చేసుకున్నామని, నేటి నుండి 21 రోజుల పాటు జిల్లా కేంద్రాలతో పాటు మండలాలు, గ్రామ పంచాయతీలలో పండుగ వాతావరణంతో జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు చరిత్రలో గొప్ప వేడుకలుగా నిలిచిపోనున్నాయని భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పోట్రు గౌతమ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఐటిడిఎ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు వందనాన్ని స్వీకరించి అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ పతికాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా గిరిజనులకు అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఏజన్సీ ప్రాంతంలోని ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య,వైద్య,ఇంజనీరింగ్. వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి రంగాలలో సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో తనకు అవకాశం కల్పించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు.

ముఖ్యంగా గిరిజన విద్యార్థినీ,విద్యార్థుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆశ్రమ, ఉన్నత ప్రాధమిక పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో 24,750 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే క్రీడలలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో పాల్గొనడానికి రెండు క్రీడా పాఠశాలలు కూడా నడుపుతున్నామని చెప్పారు. ఈ ఏడాది పది పరీక్షా ఫలితాల్లో ఆశ్రమాల్లో 77 శాతం, వసతి గృహాల్లో 60 శాతం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 95 శాతం ఉత్తీర్ణత వచ్చిందని తెలిపారు. భద్రాచలం పరిధిలోని మూడు వైటీసీల ద్వారా వివిధ రకాల విభాగాల్లో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోర్సులను అందిండం జరుగుతోందని, 2014 నుండి శిక్షణ, స్వయం ఉపాధి కోర్సులలో 13237 మంది యువతీ, యువకులు శిక్షణ పొంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు.

ట్రైకార్ ద్వారా వివిధ పథకాలలో 80 వేల నుండి రూ. 5లక్షల వరకు సబ్సిడీ మంజూరు చేస్తున్నామన్నారు. అనంతరం ఐటిడిఎ ద్వారా జరుగుతున్న వివిధ పథకాల గురించి వివరించారు. ఈ నెల 17న తెలంగాణ గిరిజన సంబరాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్‌ఫేర్ ఈఈ తానాజీ, ఏవో భీమ్, జిసిసి డిఎం విజయ్‌కుమార్, అగ్రికల్చర్ ఏడీ భాస్కర్, ఎస్‌ఓ సురేష్‌బాబు, ఉద్యానవన అధికారి అశోక్‌కుమార్, ఆర్‌వోఎఫ్‌ఆర్ డిటి శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, ఏసీఎంఓ రమణయ్య, ఎటిడివో నర్సింగరావు, జెడియం హరికృష్ణ, వివిధ విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News