Sunday, April 28, 2024

ఈ దేశానికి ‘బాబా మీటర్’ కావాలి!

- Advertisement -
- Advertisement -

telugu story about Fake babas frauds

 

కరోనా టెస్టులో భాగంగా అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జ్వరమేమైనా వచ్చిందా? శరీర ఉష్ణోగ్రత ఎంత వుందీ? అనేది థర్మల్ స్క్రీనింగ్‌లో తేలిపోతుంది. థర్మామీటర్ అయినా తెలియజేస్తుంది. అలాగే ఈ దేశానికి ఒక ‘బాబా మీటర్’ అత్యవసరంగా కావాలి! ఏమిటీ ఈ బాబా మీటర్ గూర్చి ఎప్పడూ వినలేదేమని అనుకోవద్దు. ఈ కరోనా వైరస్‌నే కాదు, వైజ్ఞానిక స్పృహ గల వాళ్లంతా కలిసి, దైవ భావనా వైరస్‌ను మట్టుబెట్టాలి. మానవాళికి ‘హ్యూమన్ వాల్యూ వ్యాక్సిన్’ కూడా ఇవ్వాలి. దీన్ని ముందుగా దేశంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వారితో మొదలుపెట్టాలి. ఆ తర్వాత దేశంలోని బాబాలకు, స్వాములకు, యోగులకు, మాతలకు, ఫాదర్‌లకు, ముల్లాలకు, మౌల్వీలకు అన్ని మతాల మత పెద్దలకు ఇవ్వాలి. సమాజంలో పెత్తందార్లకు తరువాత వరుసలో ఇస్తూ రావాలి. చివరికి ఎలాగూ సామాన్య పౌరులకు, పిల్లలకూ ఇవ్వాలి. దీని ఫలితం ఏమొస్తుందంటే, దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే మోసగాళ్లంతా మంచివాళ్లవుతారు. తాము దైవాంశ సంభూతులమని ప్రచారం చేసుకోకుండా బుద్ధిగా వుంటారు. ఒడ్డూ పొడుగులతో, గొప్ప పొడుగులతో గొప్ప ఆరోగ్యవంతులుగా కనిపించినంత మాత్రాన వారు ఆరోగ్యవంతులు కారు. మానసికంగా ఎంత దిగజారి వుంటున్నారో, ఎంతటి మనో వైకల్యాలతో వుంటున్నారో మనం చూస్తున్నాం. పైగా అత్యున్నత పదవుల్లో వుండి జనాన్ని ఎలా కాల్చుకు తింటున్నారో మనం గమనిస్తూనే వున్నాం. ఈ పరిస్థితిని అదుపులో వుంచుకోవాలంటే వెంటనే మనకు ‘బాబా మీటర్’ కావాలి!

ఇంతకీ ఆ బాబా మీటర్ ఏం తెలియజేస్తుందీ? అంటే ఆ ప్రాంతంలో ఎందురు బాబాలున్నారు? అందులో ఈ సదరు వ్యక్తి ఎంత మందిని నమ్ముతున్నాడు? ఎందరి కాళ్ల మీద పడ్డాడు. ఏఏ విషయాల్లో బాబాలకు సహాయ సహకారాలందించాడు అనేది ‘బాబా మీటర్’ నమోదు చేస్తుంది. పెద్దగా చదువుకోని వారు, నల్లడబ్బు కూడ బెట్టుకున్నవారు, అక్రమంగా భూములు ఆక్రమించుకున్న వారు, అత్యాచారాలూ, హత్యలూ చేసిన అనుభవమున్న వారు మాత్రమే ఈ పవిత్ర భారతావనిలో బాబాలుగా, స్వాములుగా, పీఠాధిపతులుగా, ముల్లాలు, ఫాదర్‌లుగా అర్చక స్వాములుగా, ప్రవచన కారులుగా అవతార మెత్తుతున్నారు. దాదాపు అదే ప్రవృత్తి గల పౌరులు వారికి భక్తులుగా, అనుచరులుగా మారుతున్నారు. ఈ విషయంలో భారత దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో వుంది. (బాబా మీటర్ అనే దాన్ని ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. అలాగే ‘హ్యూమన్ వాల్యూ వ్యాక్సిన్’ కూడా బయటికి రాలేదు. కానీ, వెంటనే వీటిని కనిపెట్టాల్సిన తరుణం వచ్చింది.) ఒకప్పుడు కాషాయం ధరించే వారిని సాధువులని, సన్యాసులని, వారు భవబంధాలని తెంచుకున్నవారని అనుకునే వారు. కోరికలు లేకుండా సర్వసంగ పరిత్యాగులుగా జీవిస్తారని ఒక అభిప్రాయం వుండేది.

వాళ్లు నిరంతరం దైవ ధ్యానంలో వుంటూ ఆకలయినప్పుడు మాత్రమే ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటారనే అభిప్రాయం వుండేది. వారి పట్ల ప్రజలకు కొంత జాలి మరి కొంత సదభిప్రాయమూ వుండేది. ఎందుకంటే వారు మోసాలు, కుట్రలు తెలియని అమాయకులని ఒకింత మంచి భావనే వుండేది. క్రమంగా కాలం మారుతూ వచ్చింది. దానితో పాటు సాధు సన్యాసులు, ఆధ్యాత్మిక గురువులు కూడా మారారు. కాషాయం వదలకుండానే అన్ని రకాల ఆగడాలకు పాలు పడుతున్నారు. నేరాలు చేస్తున్నారు. ఈ రోజు వారిని సర్వసంగ పరిత్యాగులనుకుంటే పొరపాటు మళ్లీ రోజు సంసారుల కంటే అనేక రెట్లు భోగభాగ్యాలు అనుభవిస్తున్న నేరగాళ్లు! కాషాయం ధరిస్తున్న వారిలో మళ్లీ అనేక రకాల వారున్నారు. భూ కబ్జాలకు పాలుపడుతున్న వారున్నారు. విలాసవంతమైన భవనాల్ని నిర్మించుకుంటున్న వారున్నారు. లైంగిక అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, హత్యలకు పూనుకుంటున్న వారున్నారు. మరి కొందరు దోపిళ్లు చేస్తూ రౌడీయిజం, గూండాగిరి ప్రదర్శిస్తున్న వారున్నారు. ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పథకాలు రచిస్తున్న వారున్నారు.

మేజిక్‌లు, ట్రిక్కులూ చేస్తూ వాటిని తమ మహిమలుగా ప్రచారం చేసుకుంటున్న వారున్నారు. తమ ఆశ్రమాల్ని నల్లధనం గిడ్డంగులుగా మార్చిన వారున్నారు. ఈ విషయంలో వీరికి కింది నుండి పై దాకా రాజకీయ నాయకుల అండదండలు లభిస్తున్నాయి. మత గురువులు, రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. వీరేగాక, బలహీన మనస్కులైన ఉన్నతాధికారులంతా మత గురువుల చుట్టూ తిరుగుతున్నారు. అదంతా ఒక బలమైన ‘నెట్ వర్క్’ అయిపోయింది. అందుకే ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని భూములు ఆక్రమించినా, ఎంత మంది మహిళల జీవితాల్ని నాశనం చేసినా సమాజంలోని వివిఐపిలంతా వీరిని మహానుభావులుగా “పవిత్రులు”గా పరిగణిస్తున్నారు, గౌరవిస్తున్నారు. లోపాయకారిగా వారి మధ్య నెలకొని వున్న సంబంధ బాంధవ్యాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యకంగా, పరోక్షంగా వారి బాగోతాలన్నీ సామాన్య జనానికి తెలిసినా.. వివిఐపిలు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అందువల్ల దోషులు మతాధిపతులే కాదు, వారి తప్పిదాల్ని కప్పిపుచ్చుతున్న రాజకీయ నాయకులది, ఉన్నతాధికారులది కూడా?

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఈ సన్యాసుల, యోగుల గోల ఎక్కువైంది. వారంతా రాజకీయంగా ఎదుగుతున్నారు. రాజభోగాలు అనుభవిస్తున్నారు. అందుకే చూడండి. సన్యాసులంతా శాసన సభల్లో, పార్లమెంటులో కనిపిస్తున్నారు. ఒకాయన ఏకంగా ముఖ్యమంత్రి సీటు ఆక్రమించాడు ఉత్తరప్రదేశ్‌లో ఇక మధ్యప్రదేశ్‌లోనైతే నలుగురు సహాయ మంత్రులయ్యారు. ఆ నలుగురు సన్యాసులూ నర్మదా నదీ పరిరక్షణ సమితిలో సభ్యులు. ఆయా విషయాలపై వారికున్న పరిజ్ఞానం కాకుండా, వారు కేవలం సాధువులయినందుకే ఆ పదవులు వారిని వరించాయని తెలుస్తోంది. ఇలాంటి హాస్యాస్పదమైన అంశాలు కేవలం మన పవిత్ర భారతావనిలోనే కనిపిస్తాయి. సాధు, సన్యాకులకు రాజకీయాలతో, పదవులతో, పరిపాలనతో ఏం పనోనన్నది ఎవరికీ అర్థం కాదు. అంటే మతాన్ని అడ్డపెట్టుకుని రాజ్యాధికారం చేపడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అంతర్గతంగా మత వ్యాప్తి వారి ఎజెండా అన్నది కూడా అర్థమవుతూనే వుంది. ఇలా వీరి ప్రభుత్వమే గనక కొనసాగితే అన్ని చట్టసభల్లో కాషాయ వస్త్రధారులే అగ్రభాగం లేదా సింహభాగం ఆక్రమిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి వారి గురించే ప్రజాకవి వేమన ఎప్పుడో చెప్పిన పద్యాలు… నేటి ఈ సాధు సన్యాసులకు, బాబాలకు సరిగా సరిపోతాయి. ఒకసారి వెతుక్కుని చదవండి. ఉదాహరణకు ఒకటి, రెండు ఇస్తున్నారు.

కావిబట్ట కట్టి కడు యోగి వలె నుండి / వెలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి / తొడరి తిరుగువాడు దొంగ సన్యాసయా!/ విశ్వదాభి రామ వినురమేమ
మనసు నిలుపలేని మాయా విరక్తులు /మనసు పడుదురేల మగువ కొరకు /సంతా పాప పొత్తు సన్యాసి జేరడా?/విశ్వదాభి మార వినురవేమ
బారెడేసి జడలు భస్మంపు పూతలు /మరుని తోడ మారుమలయ గలరు / ఎప్పుడో కవి వేమన చెప్పింది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం!

భార్యను చంపి అక్రమంగా ఆదివాసుల భూములు ఆక్రమించిన ఓ క్రిమినల్, తను జగద్గురువునని ప్రచారం చేసుకుంటే అధికారులు, మంత్రులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పైగా దేశ ప్రధానితో పాటు కొంత మంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా అతణ్ణి ప్రశంసిస్తున్నారే? ఇలాంటి దొంగ బాబాలంతా తమకు తాము చేసుకుంటున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వీరేమైనా ఏదైనా ఒక విషయంలో క్వాలిఫికేషన్ ఉన్నవారా? బయాలజీ, స్పేస్ సైన్స్, కామర్స్, ఆస్ట్రానమి, ఫిజిక్స్, హ్యూమానిటీస్, ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మెడిసిన్, మేనేజిమెంట్ ఎందులో వీరికి నైపుణ్యం వుంది? రీసర్చ్ చేసి ఫలితాలేమైనా పబ్లిష్ చేశారా? ఇండియాలో వున్నంత మంది మూర్ఖ సద్గురువులు ప్రపంచంలో మరెక్కడా లేరు. కొందరు తమ సొళ్లు వాగుడుతో, తప్పుడు సమాచారాలతో అనైతిక, అశాస్త్రీయ అంశాలతో యూ ట్యూబ్ నింపుతున్నారు. గోబెల్స్ అంటే ఎక్కువ బాకా ఊదుకుంటున్నారు. చదువులేని అమాయకులైతే పోనీ అనుకోవచ్చు. మరి చదువుకున్న మూర్ఖులెందుకు వారికి భజనలు చేస్తున్నట్టూ? ఆధ్యాత్మికత పేరుతో దొంగ సన్యాసులు, దొంగ బాబాలు వారికి మహిమలున్నాయని ప్రచారం చేయించుకోవడమే తప్ప, ఇంత వరకు ఎవరి మహిమలూ రుజువు కాలేదు. దేనికీ ఉపయోగపడలేదు. వారికి వారు పూట గడుపుకోవడానికి తప్ప, ఎందుకు పనికి రాలేదు.

అవన్నీ వృథా! మతం ముసుగులో పవిత్రులమై పోయామని చెప్పుకునే వాళ్లంతా నేరగాళ్లే! వారిని అనుసరిస్తున్న వారు కూడా ఇలాంటి నేర ప్రవృత్తి గలవారే అందుకే చూడండి. విచారణలో జాప్యం జరిగినా.. చాలా మంది దొంగ బాబాలకు శిక్షలు పడుతున్నాయి. ఘరానా బాబా లెందరో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఇంతకూ ‘బాబా మీటర్’ ఏదో పరికరం కాదు. అలాగే, ‘హ్యూమన్ వాల్యూ వ్యాక్సిన్’ వైజ్ఞానిక పరిశోధనా ఫలితం కాదు. ఇవి హేతువాదం అందించే ఉత్పత్తులు. ఎక్కడా దొరకవు. ఎవరికి వారే ప్రయత్నించి వారి వారి మెదళ్లలో ఉత్పత్తి చేసుకోవాల్సినవి. ‘బాబా మీటర్’తో చెక్ చేయించుకొని, ‘హ్యూమన్ వాల్యూ వేయించుకుంటే… ఇంతకూ ఏం జరుగుతుందీ అంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ మనుషులే అని తెలుసుకుంటారు. తోటి మనుషుల్ని మనుషులుగా ప్రేమిస్తారు. ఎవరు ఎక్కువా కాదు, ఎవరు తక్కువా కాదు అని… అందరూ ఆ మిశ్రమ సంతతిలోంచి వచ్చిన వారమేనన్న విషయం గ్రహిస్తారు. కళ్ల పొరలు తొలగిపోతాయి. అడ్డుగోడలు పలిగిపోతాయి. కొందరిలో గూడుకట్టుకున్న మదం, అహంకారం చెదిరిపోతుంది. కులాల, మతాల, ప్రాంతాల, రంగు భేదాల ఆధిక్యతలు అంతరిస్తాయి. ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ పర్యావరణం అందరి బాధ్యత అని కళ్లు తెరుచుకుంటాయి. ఈ ప్రయత్నంలో సనాతన ధర్మాలు అడ్డుపడతాయి. సంప్రదాయాలు, ఛాందస్తాలు అరిచి గీ పెడతాయి. మనోభావాల్ని దెబ్బ తీస్తాయి. వాటన్నిటిని బేఖాతర్ చేస్తూ, ఎదుర్కొని ధైర్యంగా ముందుకు దూసుకు వచ్చిన వారేనే.. విజయం వరిస్తుంది! ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు మా‘నవ’వాద, వైజ్ఞానిక యుగం మనసారా ఆహ్వానిస్తుంది!!

డా. దేవరాజు- మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News