Wednesday, May 1, 2024

14 మంది అధికారులకు అవార్డులను ప్రదానం చేసిన సిఎం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు, వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు అవార్డులను సిఎం కెసిఆర్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు. వారు చూపించిన ధైర్య సాహాసాలను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. గోల్కొండ కోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్ అవార్డులను వారికి అందచేశారు.
అవార్డు గ్రహీతలు.. వారు చేసిన సేవలు
* ములుగు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పాయం వీనయ్య ఏటూరునాగారం మండలం కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న పాఠశాల విద్యార్థులను రక్షించారు.
* జనగాం జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ ఎండి రెహమాన్ విద్యుత్ పునరుద్ధరణలో విశేష సేవలు అందించారు.
ములుగు జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి సంజీవ్ రావు ముత్యాల ధార జలపాతంలో చిక్కుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు.
* ములుగు జిల్లా పరిషత్ సీఈఓ ప్రసన్న రాణి కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతో పాటు, వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహార పంపిణీని పర్యవేక్షించారు.
* భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌ఏఎస్పీ లత వరదల్లో చిక్కుకున్న జిల్లాలోని పలు గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు.
* భూపాలపల్లి జిల్లాకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి.ప్రదీప్ కుమార్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షిచేందుకు బోట్లు, హెలికాప్టర్ సేవలను సమర్థంగా వినియోగించి వంద మందికి పైగా ప్రజలను రక్షించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల పంచాయతీ అధికారి ముత్యాల రావు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
* భూపాలపల్లి జిల్లాకు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామనరసింహారెడ్డి వరదల్లో చిక్కుకున్న ప్రజలను తరలించడంతో పాటు తప్పిపోయిన నలుగురిని రక్షించారు.మరో మూడు మృతదేహాలను గుర్తించారు. భూపాలపల్లి జిల్లా కొయ్యురు ఎస్‌ఐ వి.నరేష్ మానేరు నది వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు.
* వరంగల్ జిల్లా మట్వాడ ఏఎస్‌ఐ కె.సంపత్ తన బృందంతో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 880 మంది ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
* ములుగు జిల్లాకు చెందిన ఏఎస్‌ఐ జి.రాంబాబు మేడారంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన బృందంతో కలిసి రక్షించారు.
* ములుగు జిల్లాకు చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ట్ కానిస్టేబుల్ కె.శ్రీకాంత్ మేడారం వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన బృందంతో కలిసి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
* సచివాలయ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఏఎస్‌ఓ ఏడిగ చిట్టిబాబు ఉక్రెయిన్, సూడాన్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్ర పోషించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News