Sunday, April 28, 2024

నగరాభివృద్దికి ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రతో తెలంగాణకు చారిత్రాత్మక బంధం ఉంది
మహారాష్ట్ర ప్రతినిధుల బృందంతో సమావేశమైన మంత్రి కెటిఆర్
నగరాభివృద్దికి బుల్లెట్ వేగంగా కన్నా స్పీడ్‌
అభివృద్దిని ప్రశంసించిన మహారాష్ట్ర ప్రతినిధి బృందం

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి పైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర క్రెడాయ్ ప్రతినిధుల బృందం హైదరాబాదులో మూడు రోజులపాటు పర్యటిస్తున్నది. శనివారం మహారాష్ట్ర ప్రతినిధుల బృందంతో మంత్రి కే తారక రామారావు టీ హబ్ లో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన నగర ప్రగతి పైన వారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేపట్టిన ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను వివరించారు.దశాబ్దంన్నరపాటు అనేక ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ 10 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నామన్నారు.

రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా వంటి సంక్షోభాలను విజయవంతంగా అరికట్టామన్నారు.భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది వాస్తవమైనప్పటికీ దేశాన్ని నడిపిస్తున్నది మాత్రం నగర ప్రాంతాలే అన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు.ఎంత ఎక్కువ నిధులను మౌలిక వసతుల కల్పన పైన వెచ్చిస్తే అంత వేగంగా అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పని చేసిందని, నగరంలో ఐటీ,ఐటీ అనుబంధ రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనను చేపట్టామని,అందుకే ఈరోజు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. నగరం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బెంగళూరు నగరాన్ని ఐటి ఉద్యోగాల కల్పనలో వరుసగా రెండు సంవత్సరాలు దాటివేసిందని,ఐటీ ఎగుమతులతో పాటు వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణల పైన ప్రధానంగా దృష్టి సారించిందని, అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్ మరియు భవన నిర్మాణాలు అనుమతుల కోసం టిఎస్ బి పాస్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్ళాయని,అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుంది అని అంటున్నామన్నారు.

హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టి భవిష్యత్తు విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాలను మా ప్రభుత్వం చేస్తుందని,నగరంలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ఎస్ ఆర్ డి పి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జి లాంటి నిర్మాణాలను పూర్తి చేశామన్నారు.హైదరాబాద్ నగరంలో జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ప్రారంభించిన సి ఆర్ ఎం పి కార్యక్రమాన్ని అధ్యయనం చేసిన తర్వాత ముంబై నగరం కూడా అనుసరిస్తున్నదన్నారు.భవిష్యత్తు అవసరాలకు అవసరమైన విద్యుత్ మరియు తాగునీటి సరఫరా వ్యవస్థలను సిద్ధం చేసి ఉంచబోతున్నామని,100% మురుగు నీటిని శుద్ధి చేసే తొలి నగరంగా మారబోతున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర ప్రగతిని అనేకమంది ప్రముఖులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. దేశంలో ముంబై నగరం తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించు కుందని, వినూత్నమైన టిడిఆర్ విధానం ద్వారా సుమారు 5 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని జిహెచ్‌ఎంసి పొదుపు చేయగలి గిందన్నారు.టీఎస్ బి పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతోనూ ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశమై నగర అభివృద్ధి కోసం అవసరమైన కార్యక్రమాల విషయంలో సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసి ఒక్కరోజే 7 జీవోలను జారీ చేసినట్లు తెలిపారు.దేశంతోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారికి పక్కా ఇల్లు నిర్మించి ఉచితంగా అందజేశామని,ప్రతి పట్టణ మరియు స్థానిక సంస్థల బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు మంత్రి కేటిఆర్ మహారాష్ట్ర ప్రతినిధులకు స్వాగతం పలికారు.విద్యార్థిగా పూణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని తెలిపిన మంత్రి కేటిఆర్ గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చారిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని,అందుకే తెలంగాణ మహారాష్ట్రల మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు.

తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంది- మహారాష్ట్ర ప్రతినిధి బృందం
హైదరాబాద్ నగరం గత పది సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని మహరాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న పరిస్థితి తమకు గుర్తుందని తెలిపింది. పరిపాలకులకు సరైన విజన్ ఉంటే, నగరం కానీ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అనడానికి, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ గత పది సంవత్సరాలలో సాధించిన ప్రగతి ఒక ఉదాహరణ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విధానం గురించి అనేక అంశాలను తెలుసుకున్నామని మహారాష్ట్ర ప్రతినిధి బృందం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News