Sunday, May 5, 2024

భూ క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో భూ క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదారబాద్ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీఓ 58, 59, 76, 118 క్రింద భూ క్రమబద్దీకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్‌పై సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ జీవో 59 క్రింద గతంలో వచ్చిన దరఖాస్తులలో రూ.10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదన్నారు.

వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపు చేయని పక్షంలో భవన నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించాలని ఆయన సూచించారు. జీఓ 59 క్రింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం చాలా తక్కువ ధరకు భూ క్రమబద్దీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్దిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

జీఓ 58 క్రింద గతంలో 20,668 మంది లబ్దిదారులకు పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్దం చేశామని, వాటిలో 561 పట్టాల పంపిణీ ఇంకా పెండింగ్ ఉందని దీనిని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. భూముల క్రమబద్దీకరణ కటాఫ్ తేదీని 2020 జూన్ 2కు పొడిగిస్తూ జీఓ 58, 59, 76 కింద ప్రభుత్వం మరో మారు దరఖాస్తులను స్వీకరించిందని, జీఓ 58 కింద 1,20,357 జీఓ 59 కింద 57,661, జీఓ 76 కింద 11,810 దరఖాస్తులు వచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.

జీవో 118 కింద పెండింగ్ దరఖాస్తులు 15 రోజుల పూర్తి చేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యుల్స్ అందుబాటులోకి తెచ్చామని, ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు చిన్న,చిన్న లోపాలను సవరించడం జరుగుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఆర్ ప్యూరిఫికేషన్ కోసం ముందస్తుగా 5 ఎకరాలపై ఉన్న 12,546 కేసులను మండలాల వారిగా గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ భూ సంబంధిత అంశాలపై తహసిల్దార్లతో చర్చించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్ మ్యూటేషన్‌లు, నాలా కేసులు పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీలలో వార్డుల వారిగా క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో లోపు నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులతో అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీరబ్రహ్మచారి, తహసిల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News