మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రెండవ దశ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వెబ్ ఆప్షన్లకు శనివారం వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీన దోస్త్ రెండవ విడత సీట్లు కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 982 డిగ్రీ కళాశాలల్లో 501 కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుండగా, మొదటి విడతలో 1,41,340 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
మొదటి దశ సీట్ల కేటాయింపు తర్వాత 2,66,050 డిగ్రీ సీట్లు ఖాళీగా మిగిలాయి. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీలోగా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి సూచించారు. మొదటి సీట్లు పొందిన మరింత మెరుగైన కళాశాలల్లో సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు కూడా ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, తమ సీటును ఖరారు చేసుకుని రెండవ దశలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
అలాగే మొదటి దశలో తక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని సీట్లు పొందలేకపోయిన విద్యార్థులు రెండవ దశలో ఎక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం 6.30 గంటల వరకు 56,519 మంది విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును రిజర్వు చేసుకున్నారని తెలిపారు. అలాగే రెండవ దశ కౌన్సెలింగ్లో గురువారం నాటికి 24,057 మంది దోస్త్లో రిజిష్టర్ చేసుకోగా, 33,397 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారని అన్నారు.
దోస్త్ ఆన్లైన్ సమస్యలకు విద్యార్థులకు సంప్రదించవలసి నెంబర్లు
దోస్త్ వాట్సాప్ నెంబర్ : 7901002200
దోస్త్ హెల్ప్లైన్ నెంబర్ : 040- 66662262
ఎం. విజయ రెడ్డి : 9948665161
డి.వసుంధర : 9849065364
టి.సురేష్ కుమార్ : 7660020720