Sunday, April 28, 2024

రైతులపై బయటపడిన కాంగ్రెస్ నిజ స్వరూపం

- Advertisement -
- Advertisement -

మరిపెడ : పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదురుగా గల జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిపుడి నవీన్‌రావు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని, విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయట పెట్టుకుందన్నారు.

సమైక్య రాష్ట్రంలో సాగు నీళ్ల కష్టాలు, కరెంట్ కోతల గోసలు చవి చూసిన విషయం ప్రతి రైతుకు గుర్తు ఉందన్నారు. రైతులను రాజును చేయాలనే ఉద్ధేశ్యంతో సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చి అన్నదాతలను ఆదుకునేందుకు 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, పంటల పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ. 10 వేలు అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని స్పష్టం చేశారు. రైతులకు ఎప్పటికైనా సిఎం కెసిఆరే శ్రీరామరక్ష అని అన్నారు. ఆనాడు టిడిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబునాయుడు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టనపెట్టుకున్నడని, ఇళావ టిడిపి నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా అదే విధానాలను అవలంభిస్తూ ఉచిత విద్యుత్ వద్దంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందజేస్తున్న ఉచిత విద్యుత్‌పై 3 గంటలే చాలు అంటూ అమెరికాలో అసందర్భ ప్రేలాపనలు చేసిన రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రైతాంగంపై ఉన్న కపట ప్రేమ, దుర్భద్ధిని స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఎన్నికల ముందే రైతుల పట్ల, ఉచిత విద్యుత్ పట్ల కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు సిఎం కెసిఆర్ అండగా నిలిస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తెలంగాణ రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపిపి గాదె అశోక్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News