Sunday, May 5, 2024

కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు..నాగార్జున సాగర్ జలవివాద నేపథ్యంలో దశరథరామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగిందనీ, నీటి పంపకాలకు సంబంధించి 60 రోజుల లోపుల విధివిధానాలను ప్రకటించాలని చట్టంలో వుందని ఆయన తెలిపారు. అయితే విభజన జరిగిన ఏడు సంవత్సరాల తరువాత 2021 లో విధానాలు ప్రకటించడం, తదనంతరం నేటికి రెండున్నర సంవత్సరాలైనా వీటిని అమలు పరచకపోవడం తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శమని ఆయన విమర్శించారు.

కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం తమ రాజకీయ లబ్ది కోసం, ఎన్నికలలో గెలుపే పరమావధిగా రాజకీయ స్వార్థంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం పూనుకుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో నీటి పంపకాలకు సంబంధించి స్పష్టంగా వున్నప్పటికీ ఆ చట్టాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6 న చీకటి చట్టాన్ని తీసుకురావడం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు మరింత తీవ్రతరం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ చీకటి చట్టాన్ని ఉపసంహరించి విభజన చట్టంలో పేర్కొన్న నీటి హక్కులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రాజెక్టులకు సంబంధించి నీటి హక్కులను కాపాడుతూ నీటి నిర్వహణకు సంబంధించి పూర్తి బాద్యతలను తక్షణమే క్రష్ణా నది యాజమాన్య బోర్డు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News