Monday, April 29, 2024

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది బిఆర్‌ఎస్ తీరు

- Advertisement -
- Advertisement -

పదేళ్ళలో విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించలేదా?
బిఆర్‌ఎస్ పై పరిగి ఎంఎల్‌ఎ రాంమోహన్ రెడ్డి ధ్వజం

మన తెలంగాణ / హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై బిఆర్‌ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని పరిగి ఎంఎల్‌ఎ రాంమోహన్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా విచ్చల విడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కెసిఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి, బిఎస్‌పి, చివరకు సిపిఐ ఎంఎల్‌ఎ లను కూడ ప్రలోభ పెట్టి మీ పార్టీ లో చేర్చుకోలేదా? అని రాంమోహన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది ఎవరని అడిగారు.

పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎంఎల్‌ఎ లను బిఆర్‌ఎస్ చేర్చుకుందని తెలిపారు. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎంఎల్‌ఎలను చేర్చుకున్నారన్నారు. ఇందులో టిడిపి నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5 గురు, చైసిపి నుంచి ముగ్గురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, సిపిఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని తెలిపారు. 2018 లో 16 మందిని చేరుకునానరని వారిలో కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరున్నారని తెలిపారు. కెటిఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎంఎల్‌ఎల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. టిడిపి నుంచి మీ పార్టీలో చేరిన ఎంఎల్‌ఎ తలసాని తో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. అప్పటి స్పీకర్‌లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్‌లపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు లపై ఒక్క సారి కూడా కనీసం విచారణ కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంఎల్‌ఎలను చేర్చుకోవాలని మా సిఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ భావించలేదన్నారు. 100 రోజుల పాటు మేం ఆ ఆలోచన కూడా చేయలేదని, ప్రతిపక్ష ఎంఎల్‌ఎలను గౌరవించామని, ముఖ్యమంత్రి వారికి అపాయింట్ మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకున్నామన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చడానికి బిఆర్‌ఎస్, బిజెపి కుట్రలు చేశాయని ఆరోపించారు. ప్రమాణస్వీకారానికి ముందు కడియం శ్రీహరి లాంటి వారు ప్రభుత్వం కూలి పోతుందన్నారని పేర్కొన్నారు. త్వరలో కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కెటిఆర్ అనలేదా…? అని ప్రశ్నించారు. మన ప్రభుత్వం ఆరు నెలల్లో వస్తుందని కెసిఆర్ ఎంఎల్‌ఎ ల సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. మీ కుట్రలకు బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదని హెచ్చరించారు. దెబ్బకు దెబ్బ తీస్తాం, మా ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు అని ఆయన హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News