Thursday, May 2, 2024

పరిపాలనలో ప్రజల సంక్షేమమే ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -
  • సుపరిపాలనలో గుణాత్మకమైన మార్పు
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట: ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతగల పరిపాలనను సుపరిపాలన అంటారని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనలో ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతగా ఉండే దాన్ని సుపరిపాలన అంటారన్నారు. ప్రజల సంక్షేమం కేంద్ర బిందువుగా అధికారులు పనిచేస్తే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. సుపరిపాలనలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు, న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మీడియా రంగం అన్ని కలిసి ఉంటాయన్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్‌గా బాధ్యతలు చేపట్టి ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మకమైన కార్యక్రమాలను తీసుకు రావడం మూలంగా రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమైందన్నారు. సిఎం ఆలోచనతో నూతన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ, పోలీస్, ఇంజనీరింగ్, వ్యవసాయ డివిజన్లు తదితర శాఖలో నూతనంగా ఏర్పాటు చేయడం మూలంగా పరిపాలనలో వికేంద్రీకరణ జరిగి అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి చేరువై ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, మహిళా సంక్షేమం, రెవెన్యూ, పోలీస్ తదితర అన్ని శాఖలలో అవాంఛనీయ మార్పులు సంభవించి ప్రజలకు సుపరిపాలన అందించబడి ప్రజల జీవన విధానంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.

సుపరిపాలనలో మనమందరం భాగస్వాములవడం మన అదృష్టం అన్నారు. 9 ఏండ్ల కాలంలో సాధించిన సుపరిపాలనను అన్ని శాఖలు సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రతిక్షణం జిల్లా అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మనకు ఎప్పటికప్పుడు దిశా-నిర్దేశం చేస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. ఆయన బాటలో పయనిస్తూ జిల్లా అభివృద్ధిలో మనం మరింత చురుగ్గా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగంతో ప్రజలకు సేవ చేసే శక్తి మనకు వచ్చిందన్నారు. ప్రజలతో ప్రేమగా మెలిగి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా మాట్లాడుతూ శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు అన్నారు.

ఈరోజు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే పోలీస్ వ్యవస్థ తీరే నిదర్శనం అన్నారు. పోలీస్ శాఖ ‘లా అండ్ ఆర్డర్‘ తో పాటు ప్రజా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ అనుభవించాలంటే చక్కటి పోలీస్ వ్యవస్థ అవసరం అందుకే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలను పోలీసులకు దగ్గర చేసి ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను నెలకొల్పిందన్నారు. షీటీంతో మహిళలకు స్వేచ్ఛ పెరిగిందన్నారు. జిల్లాలో అందరి భాగ స్వామ్యంతో పోలీసు వ్యవస్థ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో – స్థానిక పరిపాలన వ్యవస్థ తీరును జిల్లా అదన కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్, – రెవెన్యూ వ్యవస్థ పనితీరును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, అటవీశాఖ పాలన విధానంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్,పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పరిశ్రమలు శాఖ తదితర శాఖల వారు సుపరిపాలన వ్యవస్థల గురించి ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News