ప్రపంచ దేశాలకు ప్రపంచ బ్యాంకు నిపుణుల బృందం సూచన
న్యూఢిల్లీ : జనాభా పర్యవేక్షణ ఆధార అధ్యయనాల ప్రకారం పదేళ్ల లోపు పిల్లలకు కరోనా గ్రహణశీలత చాలాతక్కువగా ఉంటుందని, అందువల్ల స్కూళ్లు తెరిచే ముందు వ్యాక్సినేషన్ కోసం విద్యాసంస్థలు నిరీక్షించ వలసిన పనిలేదని ప్రపంచ బ్యాంకు విద్యానిపుణుల బృందం తన అధ్యయనంలో స్పష్టం చేసింది. వివిద దేశాల్లో ఎదురైన అనుభవాల ఆధారంగా అలాంటి పిల్లలకు స్కూళ్లు ప్రారంభించడం క్షేమమే అవుతుందని పేర్కొంది. పదేళ్ల లోపు పిల్లలకు కొవిడ్ 19 సంక్రమణ చాలా తక్కువని, అలాగే వైరస్కు తీవ్ర అస్వస్థత కానీ మరణాలు కానీ ఆ పిల్లల్లో ఉండబోవని, వారి వల్ల వైరస్ వ్యాప్తి కూడా ఉండబోదని వివరించింది. కరోనా మహమ్మారి బయటపడిన సంవత్సరం తరువాత మనం వైరస్ గురించి వ్యాప్తి గురించి, వ్యాప్తిని అదుపు చేయడం తదితర విషయాలు చాలా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అధికార ఆరోగ్య వ్యవస్థలు స్కూళ్లను మూసివేయడం ఆఖరి ఆయుధమే అవుతుందని సూచించినట్టు గుర్తు చేశారు.
స్కూళ్ల వద్ద వైరస్ వ్యాప్తి నుంచి రక్షించుకోడానికి స్కూళ్లను మూసివేయడం వల్ల పిల్లల విద్యాబోధన దెబ్బతినడమే కాక, మానసిక ఆరోగ్యం పైన, అభివృద్ధి పైన విపరీత పరిణామాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 80 శాతం స్కూళ్లు రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటిలో 54 శాతం వ్యక్తిగత నిబంధనలను పాటిస్తున్నాయి. 34 శాతం మిశ్రమ , కృత్రిమ నిబంధనలను అనుసరిస్తున్నాయి. 10 శాతం స్కూళ్లు మారుమూల ప్రాంతాల్లో ఆదేశాలను అమలు చేస్తున్నాయి. 2 శాతం స్కూళ్లు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని ప్రపంచ బ్యాంకు సమీక్షించింది. గత ఏడాది కొవిడ్ మహమ్మారి వల్ల 188 దేశాల్లో స్కూళ్లు మూతపడడంతో 1.6 బిలియన్ విద్యార్ధులు చదువులకు నోచుకోలేక ఉండిపోయారు. వైరస్ భయంతో వారికి కలిగే నష్టం కన్నా స్కూళ్లు మూసివేయడంతో వచ్చిన నష్టమే ఎక్కువగా ఉన్నట్టు తేలిందని ప్రపంచ బ్యాంకు తన అధ్యయనంలో పేర్కొంది.