తెలంగాణ గాంధీ కెసిఆర్ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు
బిజెపికి మతరాజకీయాలే తెలుసు
ఎంఎల్ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్సిలు భానుప్రసాద్, శ్రీనివాస్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు గౌరవిస్తున్న సిఎం కెసిఆర్ను బిజెపిలోని గాడ్సే వారసులు దూషిస్తుంటే ప్రజలు సహించరని పియుసి చైర్మన్, ఎంఎల్ఎ,జీవన్రెడ్డి,ప్రభుత్వ విప్,ఎంఎల్సి భానుప్రసాద్, ఎంఎల్సి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ మేము తలుచుకుంటే సిఎం కెసిఆర్ను దూషిస్తున్న బిజెపి నేతలు రాష్ట్రం లో ఎక్కడా తిరగలేరని హెచ్చరించారు. నమస్తే ట్రంప్ అని కార్యక్రమం నిర్వహించిన బిజెపినాయకులే కెసిఆర్ను, కెటిఆర్ను ట్రంప్లాంటివాళ్లు అనడం విచిత్రంగా ఉందన్నారు. వలస కార్మికులతో ప్రధానిమోడీ ఆడుకుంటే సిఎం కెసిఆర్ వారిని ఆదుకున్నారని చెప్పారు. బిజెపి బక్వాస్ పార్టీ అని ఆయన నిందించారు. కేంద్ర పదవుల్లో గుజరాత్ వారిని ప్రధాని మోడీ నింపుతుంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఒక్కమాటకూడా ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఒక్కపైసాకూడా తీసుకురాని బిజెపినాయకులు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని హేళన చేశారు. వరదబాతులకు రాష్ట్రం ప్రభుత్వం ఆర్థికంగా రూ.10వేలు తక్షణ సహాయం అందిస్తే తాము రూ.25 వేలు తెస్తామని మాట్లాడిన బిజెపి నాయకులు ఇప్పుడు ఎందుకు ప్రజలముందుకు రాలేకపోతున్నారని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో బిజెపి ఇంఛార్జీ అయిన తరుణ్చుగ్ తన సొంతరాష్ట్రానికి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తుంటే స్పందించకుండా తెలంగాణలో రైతులగురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులు ఇక నుంచైనా జాగ్రతగా మాట్లాడాలని జీవన్రెడ్డి హెచ్చరించారు. బిజెపి పాలిత సిఎంలు తెలంగాణకు వచ్చి అభివృద్ధి చూడాలని ఆయన కోరారు. తెలంగాణది అభివృద్ధి ఎజెండా అయితే బిజెపిది అనాగరిక ఎజెండాని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విప్, ఎంఎల్సి భానుప్రసాద్ మాట్లాడుతూ తరుణ్ఛుగ్ పంజాబ్ రైతులను అర్బన్ నక్సలైట్లుగా పోల్చడం విచారకరమన్నారు.
రైతుల ఉద్యమాలను అర్థం చేసుకోని తరుణ్ఛుగ్కు తెలంగాణలోని రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బిజెపి నాయకుడు బండి సంజయ్ తొండి సంజయ్గా వ్యవహరిస్తూ కరోనానుకూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. బిజెపి పాలిత కర్ణాటక రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలు తుంటే రాష్ట్ర,కేంద్ర బిజెపి నాయకులకు కనుపించడంలేదాని ఆయన ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు పిచ్చి ప్రేలాపనలను మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఎంఎల్సి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీకి ఒకనీతి, అభివృద్ధి ఎజెండాలేదన్నారు. ఆపారీక్టి మతాన్ని రెచ్చగొట్టి ప్రజలను విడగోట్టటమే తెలుసన్నారు. సిఎం కెసిఆర్ను, మంత్రి కెటిఆర్లను బిజెపి నాయకులు విమర్శిస్తే ప్రజాఆగ్రహం ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి వారికి ఎందుకు కనిపించడంలేదన్నారు. తుపాకి రాముడు మాదిరిగా బిజెపి మాట్లాడుతుందన్నారు. మిషన్కాకతీయ, మిషన్భగీరథకు నీతి అయోగ్ నిధులు ఇవ్వాలన్నా కేంద్రం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.