Friday, May 3, 2024

మహిళాబంధు పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

- Advertisement -
- Advertisement -
Mahilabandhu Celebrations begin
జరుపుకోవడం సంతోషకరం, రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: మహిళాబంధు పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని, సిఎం కెసిఆర్ ఈ రాష్ట్ర మహిళలు ఇస్తున్న కానుక అని రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీప అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబురాలు నిర్వహించాలని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి, వారం రోజులుగా హాస్పిటల్లో ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్స్ అందించారు. బాలింతలకు కెసిఆర్ కిట్స్ ఇచ్చి, అందులో ఉన్న వస్తువుల గురించి వారికి తెలియజెప్పారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ ను జిల్లా హాస్పిటల్ గా అభివృద్ధి చేసుకున్నామన్నారు.

వారం రోజులుగా ఈ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కెసిఆర్ కిట్స్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కెసిఆర్ కిట్స్ అంటే కేవలం 16 వస్తువుల పెట్టే కాదని, మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అన్నారు. దీంతోపాటు ఆరునెలల గర్భవతి నుంచి మూడునెలల బాలింత వరకు ప్రతి నెల రెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తున్న గొప్ప పథకమని ఆమె అభివర్ణించారు. శిశువుకు ఆరు నెలలు నుంచి ఆరేళ్ల వరకు ప్రతి రోజూ భోజనం, బాలామృతం ఇస్తూ వారికి అండగా అంగన్‌వాడీలు ఉంటున్నారన్నారు. ఈ ఆరోగ్యలక్ష్మి పథకం కింద తెలంగాణలో 21 లక్షల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ పథకం కింద ముఖ్యమంత్రి కెసిఆర్ ఏటా 450 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు.

కల్యాణలక్ష్మిపథకం కింద…

కెసిఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఒక గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటన చూసి చలించిన ఆయన కల్యాణలక్ష్మిపథకాన్ని రూపొందించారన్నారు. మొదట్లో ఈ పథకం కింద 50 వేల రూపాయలు, ఆ తర్వాత 75 వేల రూపాయలు, ఇప్పుడు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి 10 లక్షల 32 వేల మందికి లబ్ధి చేకూర్చడం నిజంగా ఒక చరిత్ర అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, టిఆర్‌ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంటట్, వైద్యాధికారి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News