Sunday, May 19, 2024

సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ జెండా ఎగరేయాలి: ఎర్రబెల్లి

- Advertisement -
పాలకుర్తి: సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజక వర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నాడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఉద్యమాలే ఊపిరిగా సాగిందన్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని కొనియాడారు.
పాలకుర్తి నియోజకవర్గంలో దాదాపు 80 వేల సభ్యత్వాలకు పైగా చేశామని, అయినప్పటికీ గులాబీ పార్టీని మరింత ప్రతిష్టంగా చేయుట కోసం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కమిటీలను పూర్తి చేయాలనీ మంత్రి కోరారు. ఈ మేరకు సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో జెండా పండుగ నిర్వహించాలని మంత్రి  కార్యకర్తలకు ఆదేశించారు. ఈ నెల 12వ తేదీ వరకు గ్రామ, వార్డు, అనుబంధ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని, 13 నుంచి 20వ తేదీ వరకు మండల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కమిటీలను ఎన్నుకోవాలని మంత్రి సూచించారు.
ప్రతి గ్రామస్థాయి కమిటీలో 15 మంది సభ్యులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రతి కమిటీలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాలకు పార్టీ నిబంధనల ప్రకారం 50% ఉండేలా చూడాలని మంత్రి కోరారు. గ్రామస్థాయితో పాటు వాటి అనుబంధ కమిటీలు అయినా రైతు, యువజన, మహిళా, సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా సమయం వలన గత కొద్దీ నెలలుగా కార్యకర్తలను కలవకపోవడం కొద్దిగా బాధగా ఉందని, కొన్ని రోజులలోనే గ్రామాలలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకొని, పరిష్కరించుకునేందుకు ప్రణాళిక చేసుకుందామన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలకు కూడా ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ కాన్ఫరెన్స్ లో మండల పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షులు, మండల స్థాయి కార్యకర్తలు, గ్రామ పార్టీ ఇంచార్జులు, పార్టీ సీనియర్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News