Wednesday, May 8, 2024

మానవ వాదానికి దారి దీపం!

- Advertisement -
- Advertisement -

“బుద్ధుడు హింసకు వ్యతిరేకం. అయితే అతను న్యాయానికి అనుకూలంగా వుండే వ్యక్తి. ఎక్కడ న్యాయం లభించదో, ఎక్కడ అన్యాయం రాజ్యమేలుతుందో అక్కడ న్యాయాన్ని సాధించుకోవడానికి అన్యాయంపై తిరుగుబాటు చేయడానికి బుద్ధుడు అనుమతి ఇచ్చాడు” ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అన్యాయానికి లొంగిపోయి బతకగూడదు. న్యాయం కోసం పోరాడాల్సిందే! ప్రపంచ వ్యాప్తంగా తన అహింసా సిద్ధాంతంతో విరాజిల్లిన బుద్ధుడే ఆ మాట చెప్పాడని గుర్తుంచుకోవాలి. ఇది డా.బి.ఆర్ అంబేడ్కర్ తన రచనల్లో వెలిబుచ్చిన అంశం. అన్యాయాన్ని తిప్పికొడుతున్న వారు మన సామాన్య ప్రజల్లో కూడా ఎంతో మంది వుంటారు. అలాంటి వారికి మనం వెన్నుదన్నుగా నిలబడాలి. బిరుబాల రభా అనే వృద్ధ మహిళ అసోం గోల్‌పర జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నివసిస్తుంది. ఆ మహిళకు మతి స్థిమితం లేని ఒక కొడుకు వున్నాడు. అతని పిచ్చి చూపులూ, పిచ్చి చేష్టలు చూసి .. అతనొక మంత్రగాడని గ్రామస్థులు అనుమానపడ్డారు. అంత వరకు బాగానే వుంది కానీ, వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు.

వ్యక్తులు, సమాజాలు, ప్రభుత్వాలు ఏవైనా పాఠాలు నేర్చుకోదలిస్తే నేర్చుకోవచ్చు. ఉదాహరణకు క్యూబా నుంచి, అక్కడి డాక్టర్లు నుంచి నేర్చుకోవచ్చు. టర్క్, కైకోస్ దీవుల్లో గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ 19 పై పోరులో క్యూబా డాక్టర్లు సుమారు 60 వేల మందికి వైద్య సేవలందించారు. స్టార్ ఐకాన్స్ అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అయితే, క్యూబా వైద్య బృందం అధినేత అల్‌ఫ్రెడో మోరన్ తనకు అవార్డు కన్నా ఇలాంటి ప్రత్యేక విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడడమే గొప్ప సంతృప్తి ఇస్తుందనీ, ఆ దీవుల్లోని స్థానికులు కురిపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నలభై దేశాల్లో క్యూబా వైద్య బృందాలు అందిస్తున్న వైద్య సేవల్లో భాగంగానే తాము టర్క్, కైకోస్ దీవుల్లోనూ అందించామని అన్నారు.

అమెరికాలో వైద విద్య చదవాలంటే రూ. 10 కోట్లు ఖర్చుపెట్టాలి. క్యూబా ప్రభుత్వమే ఉచితంగా ఆ విద్యను అందిస్తుంది. ప్రజల డబ్బుతో చదువుకున్న క్యూబా డాక్టర్లు, ప్రజలతో మమేకమై వారి కోసమే పని చేస్తారు. సంతోషం సంపాదించడంలో వుండదు. సేవను అందించడంలో ఉంటుంది. అమెరికా వైద్యుడి కన్నా క్యూబా డాక్టరుకు జీతం చాలా తక్కువ. అయినా సరే, వారు ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఖర్చుపెట్టిన డబ్బు మళ్లీ సంపాదించాలన్న యావ వారికి వుండదు. చేగువేరా, ఫైడల్ కాస్ట్రో చూపిన బలమైన ఆరోగ్య వ్యవస్థ క్యూబాలో వుంది. అది ప్రపంచానికే ఆదర్శం! క్యూబాను శత్రువుగా చూసే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలకు సైతం క్యూబా తన వైద్య బృందాలను పంపి మానవత్వాన్ని ఎప్పుడూ చాటుకుంటూనే వుంది. ఆ దేశంలో ప్రతి వెయ్యి మందికి ఎనిమిది మంది డాక్టర్లున్నారు. మరి మన దేశ పరిస్థితి ఏమిటి? వివరాలు చూద్దాం! క్యూబాలో ప్రతి వెయ్యి మందికి డాక్టర్లు 8.2, ఇటలీలో 4.2, అమెరికాలో 2.6, దక్షిణ కొరియాలో 2.4, చైనాలో 1.8 అయితే, భారత దేశంలో మాత్రం ప్రతి వెయ్యి మందికి ఉన్న డాక్టర్ల సంఖ్య 0.62. ఈ గణాంకాలు చూస్తే వైద్య రంగంలో మన ప్రగతి అర్థమవుతోంది గదా? ఇక నిస్వార్థ సేవ గురించి ఏం మాట్లాడతాం?

ఇటీవల కొవిడ్ 19 కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) విడుదల చేసిన ప్రకటనలో ఇలా వుంది. ప్రపంచ కరోనా కేసుల్లో ఒక దశలో సగానికి పైగా భారత్‌లోనే నమోదయ్యాయనీ, భారత్‌లో రెండు కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయనీ చెప్పింది. ప్రపంచంలోని ప్రతి నాలుగు కరోనా మరణాల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతోందని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ! అంతేకాదు, కట్టడికి భారత ప్రభుత్వం తీవ్రంగా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.ఈ దేశంలో అన్ని రకాల అనర్థాలకు కాలుష్యాలే కారణం. కాలుష్యమంటే వాతావరణ కాలుష్యమే కాదు. మానసిక కాలుష్యం కూడా! మానవత్వంపై గౌరవం లేకపోవడం, మానవుడి హుందాతనాన్ని కాపాడుకుందామన్న కాంక్ష జనంలో లేకపోవడం. ఉదాహరణకు భారతీయ సమాజంలో ఏం జరుగుతుందో చూడండి. ఎనభై వేలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి, రోజుకి మూడు వందలు అతి కష్టం మీద సంపాదించుకునే రోజు కూలీ దగ్గర లంచం తీసుకుంటాడు. అక్కడ మానవత్వ స్పృహ ఉందా? ఎనభై వేలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎనిమిది వేలు అతి కష్టం మీద సంపాదించే ప్రైవేటు స్కూలు టీచర్ దగ్గరికి వెళ్ళి “మా అబ్బాయి ఎలా చదువుతున్నాడూ?” అని అడుగుతాడు.

అక్కడ నైతికతకు సంబంధించిన స్పృహ ఏమైనా వుందా? పైగా మనువాదులు మెదడులో దట్టించిన విషం ఎంత ప్రమాదకారిగా తయారైందంటే ఎదుటి వాణ్ణి మోసగించి లేదా ఇరకాటంలో పెట్టి సంపాదించిన డబ్బు తనకు ‘దేవుడు ఇచ్చిందే’ననుకుంటాడు అట్లని సమాజాన్ని కూడా నమ్మిస్తూ వుంటాడు. “నా కులస్థుల అభివృద్ధికి పాటు పడడమే నా ప్రథమ కర్తవ్యం. విశాలమైన సమాజ హితం కోసం పని చేయడమనేది ఆ తర్వాతి విషయం” అని అన్నారు రాజస్తాన్ శిశు సంక్షేమ శాఖా మంత్రి మమతా భూపేష్. ఇది నిసిగ్గుగా ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం! ఇంతటి నీచాతి నీచమైన ఆలోచనలున్న వారు అధికారంలో ఉంటే ఇక సమాజ స్వరూపం ఎలా వుంటుంది? మనుషులంతా ఒక్కటి. మానవ జాతి అంతా ఒక మిశ్రమ సంతతి అని వీరు ఎప్పుడు తెలుసుకుంటారో కదా? అబద్ధాలు ప్రచారం చేసే వారికి పలుకుబడి పెరుగుతోంది. వాస్తవాలు మాట్లాడే వారి పరిధి కుంచించుకుపోతూ వుంది.

వారిని దోషులుగా నిలబెట్టి వారి పలుకుబడి తగ్గిస్తున్నారు. ఒక్కోసారి వారి ప్రాణాలు తీయడం కూడా చూస్తున్నాం. హంతకులు అధికారంలో వుంటే అంతకన్నా ఇంకేం జరుగుతుంది? చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేస్తున్న నేటి బిజెపి ప్రభుత్వం సావర్కర్‌ను జాతి పితగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇప్పటికే మహాత్మా గాంధీని ఏ ప్రభుత్వమూ జాతిపితగా ప్రకటించ లేదని ప్రచారం ప్రారంభించింది కదా? “దయా గుణం అనేది ఒక ప్రత్యేకమైన భాష. దాన్ని చెవిటి వాళ్ళు వినగలరు? గుడ్డి వాళ్ళు కనగలరు” అని అన్నారు రచయిత మార్క్‌ట్విన్! ఇప్పటి ఈ మూర్ఖులకు మార్క్‌ట్విన్ ఎవరో తెలియదు. పైగా, ఆయన చెప్పిన మాటల సారాంశం అర్థం కావాలంటే వాడు ముందు మనిషై వుండాలి. వాడిలో ఇంత దయాగుణం కూడా వుండాలి. బుల్డోజర్ ప్రభుత్వాలు నడిపే సన్యాసులకు ఇవన్నీ ఎప్పుడు అర్థం కావాలి?
“బుద్ధుడు హింసకు వ్యతిరేకం. అయితే అతను న్యాయానికి అనుకూలంగా వుండే వ్యక్తి.

ఎక్కడ న్యాయం లభించదో, ఎక్కడ అన్యాయం రాజ్యమేలుతుందో అక్కడ న్యాయాన్ని సాధించుకోవడానికి అన్యాయంపై తిరుగుబాటు చేయడానికి బుద్ధుడు అనుమతి ఇచ్చాడు” ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అన్యాయానికి లొంగిపోయి బతకగూడదు. న్యాయం కోసం పోరాడాల్సిందే! ప్రపంచ వ్యాప్తంగా తన అహింసా సిద్ధాంతంతో విరాజిల్లిన బుద్ధుడే ఆ మాట చెప్పాడని గుర్తుంచుకోవాలి. ఇది డా.బి.ఆర్ అంబేడ్కర్ తన రచనల్లో వెలిబుచ్చిన అంశం. అన్యాయాన్ని తిప్పికొడుతున్న వారు మన సామాన్య ప్రజల్లో కూడా ఎంతో మంది వుంటారు. అలాంటి వారికి మనం వెన్నుదన్నుగా నిలబడాలి. బిరుబాల రభా అనే వృద్ధ మహిళ అసోం గోల్‌పర జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నివసిస్తుంది. ఆ మహిళకు మతి స్థిమితం లేని ఒక కొడుకు వున్నాడు.

అతని పిచ్చి చూపులూ, పిచ్చి చేష్టలు చూసి .. అతనొక మంత్రగాడని గ్రామస్థులు అనుమానపడ్డారు. అంత వరకు బాగానే వుంది కానీ, వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. అంతే అతని తల్లి వృద్ధ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. కొడుకుని రక్షించుకుంది. ఆ సంఘటన తర్వాత కూడా ఆ వృద్ధ మహిళ, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించింది. చేతబడులు, బాణామతి వంటి అర్థరహితమైన అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా అచంచల విశ్వాసంతో పోరాడింది. క్రమంగా కొందరు ఆమె కు తోడు నిలిచారు. పదిహేను సంవత్సరాలలో ఆమె ఆ ప్రాంతంలో నలభై రెండు మంది ప్రాణాలు కాపాడింది. ఈ విషయం అసోం రాష్ట్రం దాటి జాతీయ వార్తల్లో కెక్కింది. ఆమె నిరంతరం సాగించిన పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది. ఇప్పుడు బిరుబాల రభా మానవ హక్కుల పోరాట కార్యకర్తగా చాలా మందికి తెలుసు. సామాన్యుల్లోనే ఇలా అసామాన్యులుంటారు.

జి.ఒ 2430 ని వెంటనే అమలు చేసి మీడియాలో రోజూ అబద్ధాలు చెప్పే జ్యోతిష్యుల్ని, వాస్తు చెప్పే వారిని, ప్రవచన కారుల్ని, స్వస్థత గాళ్లని ఇంకా అలాంటి బాపతు గాళ్లని వెంటనే ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అరెస్టు చేయాలి! జనాన్ని కాపాడాలి!! వీరి వల్ల సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో ఇప్పటికైనా బేరీజు వేసుకోవాలి అని దేశ వ్యాప్తంగా హేతువాదులు డిమాండ్ చేస్తూనే వున్నారు. కాని ఏం లాభం? మన దేశంలో ప్రభుత్వాధినేతలంతా సన్నాసుల కాళ్ళ మీద పడుతున్నారయ్యే సామాన్యుల ఆక్రందనలు వారికి ఎప్పుడు వినిపించాలి? టెలిస్కోపు, మైక్రో స్కోపుల కాలం ఇది. కాని కొందరు ఇంకా హారో స్కోపును నమ్ముతూ పిచ్చివాళ్ళలా తిరుగుతున్నారు. పిడుగులు పడకుండా చర్చిల పైన, గుళ్లపైన, మసీదుల పైన ఇతర మత కేంద్రాల పైన కొన్ని వైజ్ఞానిక అమరికలు, ఏర్పాట్లూ చేసుకున్నప్పుడే సైన్సు చేతిలో మతం మరణించింది. ఇంకా ఎందుకు దాన్ని నిలబెట్టాలన్న వృథా ప్రయాస?

“దేవుడూ, దేవతలు, రాక్షసులు ఎవరూ లేరు. ఉన్నది కేవలం మానవుడు. వాడే అంతానూ” అని అన్నారు తెలుగు కవి కాళోజీ నారాయణ రావు. ఒక విచిత్రం ఏం జరుగుతోందంటే అన్ని వాదనలు అందరూ వినిపిస్తున్నారు కానీ, నాస్తిక వాదాన్ని నాస్తికులు మాత్రమే వినిపిస్తున్నారు. భావ సారూప్యం గల సంఘాలు, సంస్థలు ముఖ్యంగా వామపక్ష వాదులు ఎందుకు వెనకుడుగు వేస్తున్నారో అర్థం కాదు. ప్రత్యర్థి బలిసిపోయి అక్రమాలకు పాలు పడుతున్నప్పుడైనా అందరూ ఒక్క తాటిపైకి రావాలి కదా? “చట్టం, న్యాయం ముసుగులో అన్యాయం రాజ్యమేలడం కంటే మించిన నిరంకుశత్వం మరొకటి లేదు” అని అన్నాడు ఫ్రెంచ్ రాజకీయ తత్తవేత్త చార్లెస్ లూయిస్ మాంటెస్య్కూ. ఇవన్నీ సరే ఒక్క విషయం ఆలోచిద్దాం! బుద్ధుడు రాజ్యాన్ని, రాజ భవనాల్ని వదిలి అరణ్యంలోకి వెళ్లిపోయాడు. చెట్ల కింద వున్నాడు. కాని ఇప్పటి అత్యాధునిక సన్యాసులు చెట్లను వదిలి రాజభవనాల్లో వుంటున్నారు. పైగా రాజ్యకాంక్ష! రాజ్యం కావాలంటున్నారు? దీనికి దేశ పౌరులు ఎలా సమ్మతిస్తారూ? తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం కాదా?

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News