వర్చువల్ సమావేశంలో ఎంఒయుపైయ సంతకాలు చేసిన
విద్యాశాఖ మంత్రి సబిత, వేల్స్ మంత్రి కిర్స్టీ విలియమ్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత విద్యలో నైపుణ్యాలు పెంపొందించి, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ విద్యాశాఖ, బ్రిటీష్ కౌన్సిల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, వేల్స్ విద్యాశాఖ మంత్రి కిర్స్టీ విలియమ్స్ ఎంఎస్లు ఎంఒయుపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్.లింబాద్రి, బ్రిటీష్ కౌన్సిల్ ఇండియా డైరెక్టర్ బర్బారా విఖమ్ ఒబిఇ, బ్రిటీష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జానక పుష్పనాధంలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, బ్రిటీష్ కౌన్సిల్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం వల్ల రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఛైర్మన్ టి.పాపిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో ప్రపంచ జాబ్ మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలు పెంపొంచుకోవడానికి ఈ ఎంఒయు ఎంతో దోహదపడుతుందన్నారు. వైస్ ఛైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగునంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ ఎంఒయు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావశాలు మెరుగవుతాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, కరికులమ్ తదితర అంశాలపై బ్రిటీష్ కౌన్సిల్, రాష్ట్ర విద్యాశాఖ పరస్పరం పంచుకుంటాయని తెలిపారు.