Sunday, May 5, 2024

పాలమూరుపై పగ

- Advertisement -
- Advertisement -

అప్పర్ భద్రకు హడావిడి అనుమతులు
పాలమూరు-రంగారెడ్డి డిపిఆర్ పరిశీలనకు మాత్రం నిరాకరణ
తెలంగాణకు ఒక న్యాయం, కర్ణాటకకు మరో న్యాయమా? 
2014లోనే పాలమూరుకు ప్రధాని హామీ ఇచ్చారు
కేటాయింపులకు లోబడే పాలమూరు చేపట్టాం
అయినా ఈ వివక్ష ఏమిటి?
లేఖలో సూటిగా ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. కేటాయింపులకు లోబడే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడితే అనుమతులు ఇవ్వడం లేదని, కనీసం డీపీఆర్‌ను పరిశీలించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కర్ణాటకలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా కూడా కల్పించిందని గుర్తు చేసింది. తెలంగాణకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయమా అని ప్రశ్నించింది. అదీగాక 2014ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రస్తుత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేసింది.

ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేటాయింపులకు లోబడే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని స్పష్టం చేసింది. పోలవరం నుంచి కృష్ణా డె ల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా, సాగర్ ఎగువన ఉన్న ర్రాష్టాలు 80 టీఎంసీల కృ ష్ణా జలాలు వాడుకోవచ్చని గోదావరి ట్రిటైబ్యునల్ ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ఈ మేరకు వచ్చే 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్‌లో మిగిలిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో పాజెక్టును చేపట్టామని అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కోర్టు పరిధిలో ఉన్నాయంటూ డీపీఆర్ వెనక్కి పంపించడంలో కేంద్రం అంతర్యం ఏమిటని ప్రశ్నించింది. కర్ణాటకలో అప్పర్ భ్రద ప్రాజెక్టును కూడా ఇదే తరహాలో చేపట్టారని గుర్తు చే సింది. మైనర్ ఇరిగేషన్‌లో మిగిలిన జలాలు, పోల వరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించిన వా టాలో వచ్చే జలాల ఆధారంగా అప్పర్ భద్రకు ప్రతిపాదించారని పేర్కొన్నారు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా ఏకంగా జాతీయ హోదా కల్పించి, కేంద్ర బడ్జె ట్లో నిధులు కూడా విడుదల చేసిందని లేఖలో స్పష్టం చేసింది. కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో1200గ్రామాలకు 6 జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు అందించడానికి ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డికి మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిలదీసింది. అనుమతుల విషయంలో ఒక్కో ర్రాష్టానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించింది.

డీపీఆర్‌ను పరిశీలించాల్సిందే!
2021జూలై 15న కేంద్ర ప్రభుత్వం వి డుదల చేసిన గెజిట్ ప్రకారం అనుమతి లేనిప్రాజెక్టుల జాబితాలో పాలమూరు-రంగారెడ్డిని చేర్చారని, ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని చెప్పారన్నారు. ఈ మేరకే అనుమతుల కోసం డీపీఆర్‌ను సమర్పించినట్టు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖలో తెలిపారు. అప్పటి నుంచి ఆరు నెలల్లోగా డీపీఆర్‌ను పరిశీలించి, అనుమతులు ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. అయితే ట్రిబ్యునల్‌లో కేసు విచారణ కొనసాగుతున్నదనే కారణంతో డీపీఆర్‌ను పరిశీలించలేమని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పడం అన్యాయమన్నారు.

తమకు నీటి కేటాయింపులు చేసే అధికారం లేదని జస్టిస్ బ్రిజేష్ కుమార్ చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి డీపీఆర్‌ను పరిశీలించి, ట్రిబ్యునల్ తుది తీర్పునకు లోబడి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. డి పి ఆర్ పరిశీలన కొనసాగించాలని, త్వరగా అనుమతులు మంజూరు చేసే విధంగా కేంద్ర జల సంఘాన్ని ఆదేశించాలని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ను రాష్ట్ర సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల సంఘం లేవనెత్తిన అంశాలు అన్నిటికీ సవివరమైన సమాధానాలు సమర్పించామని రజత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News