Friday, April 26, 2024

సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. అందులో 585 సర్వీస్‌లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించగా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపనుంది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై టిఎస్‌ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ హైదరాబాద్ బస్‌భవన్ నుంచి ఉన్నతాధికారులు, ఆర్‌ఎంలు, డిఎంలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది కన్నా ఈ సంక్రాంతికి 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నామని ఎండి సజ్జనార్ తెలిపారు.

ఈ ఏడాది 3,736 ప్రత్యేక బస్సులను నడిపామని ఆయన గుర్తు చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రి 40 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంలు, డిఎంలకు ఎండి సజ్జనార్ సూచించారు. రాబోయే రోజులు తెలంగాణ ఆర్టీసికి ఎంతో ముఖ్యమైనవని, దానికి అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఎండి సూచించారు.
60 రోజుల పాటు అడ్వాన్స్‌డ్ బుకింగ్
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌కు 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు సజ్జనార్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ వరకు అడ్వాన్స్‌డ్ బుకింగ్ సదుపాయం 60 రోజుల వరకు అందుబాటులో ఉంటుందని ఎండి పేర్కొన్నారు. ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News