మనతెలంగాణ/హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలు మాస్కులు ధరించి పదవ తరగతి పరీక్షకు హాజరయ్యారు. మధురానగర్లోని ప్రతిభా హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమాయానికి అరగంట ముందే చేరుకున్నారు. యూసఫ్గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫిరా ప్రత్యేక అంబులెన్స్లో కవలలిద్దరినీ పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. ఎంఎల్ఎ మాగంటి గోపినాథ్ పరీక్షా కేంద్రానికి చేరుకుని వీణావాణీలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా అవిభక్త కవలల కోసం చేసిన ఏర్పాట్లను ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ పరిశీలించారు. వీణావాణీలు ఈ దఫా ఇంగ్లీష్ మీడియంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరిద్దరికీ ఎస్ఎస్సి బోర్డు వేర్వేరుగా హాల్ టికెట్లు కేటాయించింది. సాధారణ విద్యార్థుల కంటే వీణావాణీలకు అరగంట సమయం ఎక్కువ కేటాయించారు. ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాయడానికి వీలులేకపోవడంతో స్టేట్ హోం అధికారులు వీరికి ఇద్దరు సహాయకులను కేటాయించింది.
మొదటి రోజు ప్రశాతం
పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజు జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 5,10,461 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, 5,08,457 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి రోజు 2004 మంది(0.39 శాతం) గైర్హాజయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షకు హాజరైన విద్యార్థులు మాస్కులు, వాటర్ బాటిళ్లు, శానిటైజర్లతో పరీక్షా కేంద్రాలకు వచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎక్కువగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి వచ్చారు.
Twins Veena Vani attended 10th exam with masks