లాక్డౌన్లో ఆకలికి తట్టుకోలేక
వంద కిలోల వెన్న, జున్ను దోపిడీ
ముంబై : లాక్డౌన్ కారణంగా తినడానికి ఏమీ దొరక్క వెన్నజున్ను కాజేసిన ఇద్దరు బిచ్చగాళ్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దక్షిణ ముంబై లోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద ప్రఖ్యాతి చెందిన పావ్ భాజీ ఆహార విక్రయశాల (ఈటరీ)లో నిందితులు వంద కిలోల వెన్న, జున్ను తోపాటు చక్కెర, పెద్ద పాత్రలు దొంగిలించారు. కరోనా వైరస్ వ్యాప్తితో లాక్డౌన్ విధించడం వల్ల మార్చి నెలాఖరులో తమకు తినడానికి ఏమీ దొరక్క బలవంతంగా ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల ముందు వాళ్లు ఒప్పుకున్నారు. ఈ ఆహార విక్రయశాల యజమాని పిఎన్ దండేకర్ అజాద్ మైదాన్ పోలీసులకు ఈ దోపిడీపై ఫిర్యాదు చేశారు.
మూడు రోజుల క్రితం ఒకరు ఈ దోపిడీ గురించి ఫోన్ చేసి చెప్పారని, లాక్డౌన్ నుంచి ఈ ఈటరీ మూతపడే ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దండేకర్ తన స్టాల్ దగ్గరకు వెళ్లి చూడగా, వెనుక వైపు నుంచి బద్దలు కొట్టినట్టు ఉండడం గమనించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో 80 కిలోల వెన్న, 20 కిలోల జున్ను చక్కెర, పాత్రలు మొత్తం రూ. లక్ష విలువైన వి కాజేయడమైందని గుర్తించారు. ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించిన సంతోష్ థాపా(20).కరన్ జాదవ్ (25) అనే పేవ్మెంట్ నివాసులను ఆదివారం అరెస్టు చేశారు. 48 ఏళ్ల నుంచి ప్రసిద్ధి వహించిన ఈ స్టాల్ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉంది. బిఎంసి మిలిటరీ కియోస్క్ కమిటీ ఈ స్టాల్ను కేటాయించింది. ఇందులో 25 మంది పనిచేస్తున్నారు.