Thursday, May 2, 2024

మణిపూర్ మంటలు ఆరవెందుకు?

- Advertisement -
- Advertisement -

మణిపూర్ 60 రోజులుగా మండుతోంది. మణిపుర్ పట్ల ప్రధాని మౌనం వహించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్ గురించి ప్రధాని రోజూ చర్చిస్తున్నారని కేంద్ర గృహ మంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ అన్నారు. జర్మన్ నియంత హిట్లర్ కూడా మౌనమునే. గృహ మంత్రి హీన్రిచ్ హిమ్లర్, చైతన్య ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఎర్విన్ రోమెల్, శాఖా రహిత మంత్రి జర్మన్ వాయు సేన అధిపతి హెర్మన్ గోరింగ్‌లతో మాత్రమే మంతనాలాడేవారు. కశ్మీర్, లక్షద్వీప్ ఘటనలతో మణిపూర్ మంటలకు సారూప్యముంది. రాజ్యాంగ అధికరణలు 370, 35ఎ కశ్మీర్ ప్రజలకు భూమిపై హక్కులనిచ్చాయి. వీటి రద్దుతో కశ్మీర్ భూములను ఆశ్రిత కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పారు. లక్షద్వీప్‌లో కేంద్ర అడ్మినిస్ట్రేటర్ రాజ్యాంగ పరిమితిని దాటి చట్టాలు చేశారు.

ప్రకృతి వనరులను, సుందర సముద్ర తీరాలను, జనులులేని ద్వీపాలను కార్పొరేట్లకు పంచారు.నేటి మణిపూర్ అల్లర్లకు పాలక వర్గాల ఇలాంటి చర్యలే కారణం.2017లో 21 సీట్లతో ఎత్తుగళ్ళతో బిజెపి మణిపూర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైదిక మతవాద అధిక సంఖ్యాక మేతేయిలను, సన మహిలను సంఘ్ సంస్థలు సంఘటిత పర్చి గిరిజన కుకీలపై దాడి చేశాయి. కుకీలతో ఆస్తులు, ఆవాసాలు, పొరుగు పంచుకోవద్దని గతేడాది ఎన్నికల్లో బీరేన్ సింగ్ మేతేయిలకు చెప్పారు. ఈ గుజరాత్ హిందుత్వ నమూనాను మేతేయిలు పాటించారు. క్రైస్తవులుగా మారిన మేతేయిలనూ తరిమేశారు. కుకీలు, నాగాలు మణిపూర్ లోయలో పిల్లలను చదివించుకుంటారు. చిన్న పనులతో అద్దె ఇళ్ళలో బతుకుతారు. మేతేయిల చర్యలతో పిల్లల చదువు, పెద్దల బతుకు దెరువు ఆగాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, శాంతి భద్రతలు, జీవన ప్రమాణాలు పెంచుతామని ప్రధాని ప్రచారం చేశారు.

36 వేర్పాటువాద సంస్థల్లో ప్రభుత్వం లో భాగస్వాములైన మేతేయిల తీవ్రవాద సంస్థల నిర్వహణ ఆంక్షలను 2022 ఏప్రిల్‌లో ఎత్తేశారు. అవి విజృంభించాయి. మేతేయిలకు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా ఇస్తామని ప్రధాని వాగ్దానంచేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతో రాజకీయ ప్రాతినిధ్యం సాధించలేని మారుమూల ప్రాంతాల గిరిజనులకు రాజ్యాంగం షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను ఇచ్చింది. ఈ అర్హతలేని మేతేయిలకు ఈ హోదా ఎలా ఇస్తారు? ఆ హోదా కోసం మేతేయిలు ఉద్యమించారు. మేతేయి తీవ్రవాద సంస్థలు, సంఘ్ వత్తాసు పలికాయి. దీనికి గిరిజనులు నిరసన తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు మేతేయిలు హింసకు పాల్పడ్డారు.మణిపూర్‌లో మయన్మార్ వలసదార్లు చొరబడ్డారని సంఘ్ ప్రచా రం. మణిపూర్‌లో విదేశీయుల ప్రవేశానికి నియంత్రిత ప్రాంత అనుమతి కావాలి. ఇది 10 రోజులకే ఇస్తారు. అక్రమ వలసదారులు రాలేరు. మయన్మార్ చిన్ తెగ వలసదార్లు, అధికారుల నిర్లిప్తతతో మణిపూర్‌లో చొరబడ్డారు. మయన్మార్ రోహింగ్యా ముస్లింలను అడ్డుకున్న కేంద్రం వీరిని ఆపలేదు.

2013లో బిజెపి ప్రభుత్వాలు గుజరాత్, రాజస్తాన్, హర్యానాలకు వైదిక మతస్థులను రానిచ్చాయి. వారికి పౌరసత్వం, ఓటు హక్కు ఇచ్చాయి. సాధారణ ఎన్నికల్లో సీట్లు పొందారు. ఇదే ప్రయోజనాన్ని ఆశించి కేంద్ర, రాష్ట్ర పాలకులే మణిపూర్‌లోకి బర్మీయులను రానిచ్చారని అనుమానం. కుకీలు నివసించే మణిపూర్ పర్వత ప్రాంతాల్లోబొగ్గు నిల్వలున్నాయి. ఇటీవల పెట్రోలియం నిక్షేపాలు బయటపడ్డాయి. వాటిని తమ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టాలని బిజెపి పాలకుల పన్నాగం. రక్షిత, వన్యప్రాణ అభయారణ్య అడవుల సాకుతో కుకీల భూములను ఆక్రమించారు. వారిని అక్కడి నుండి తరిమేశారు. కుకీలలో మాదకద్రవ్యాల అలవాటు, ఎయిడ్స్ వ్యాధి ఎక్కువ. యువత నిర్వీర్యమైంది. కుకీలు నల్లమందు పండిస్తున్నారని నేరాలు మోపారు. నల్లమందు తోటలను ధ్వంసం చేశారు. నల్లమందు పండించడం నేరం కాదు. మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల తయారీ నేరం. మేతేయి వాణిజ్యవేత్తలే ఈ పని చేస్తారు. పాలక వర్గ మేతేయిల డ్రగ్ సిండికేట్‌లు కుకీల నుండి నల్లమందు పంటను నామమాత్రపు ధరకు కొంటారు.

పంటతో సహా నల్లమందు వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని డ్రగ్ సిండికేట్‌ల పథకం. ఇటీవల పోలీసులు నల్లమందు ముఠాలను అరెస్టు చేశారు. వారిలో ముఖ్యమంత్రి బంధువులున్నారు. ఆర్థిక అసమానతలు,పేదరికం, నిరుద్యోగం, జాతుల వైషమ్యాలు కుకీలను నల్లమందు పంట వైపుకు, గిరిజన స్త్రీలను వ్యభిచారం వైపుకు నెట్టా యి. బిజెపి పాలకులు ఈ సమస్యలను పరిష్కరిస్తే కుకీలు నల్లమందు జోలికి పోరు. ఎయిడ్స్ వ్యాధి తగ్గుతుంది.మణిపూర్‌లో క్రైస్తవ జనాభా పెరిగిందని, వారు మేతేయిలను దాటి పోతారని సంఘ్ ప్రచారం. దేశంలో ముస్లింలు పెరిగి హిందువులను అపాయంలో ముంచుతారన్న ప్రచారం లాంటిది. 1961 -2011 మధ్య 50 ఏళ్ళలో క్రైస్తవులు 5 లక్షలు పెరిగారు. వైదిక మతస్థులూ పెరిగారు. కాలక్రమంలో పెరిగిన జనాభా, ఓట్ల కోసం పాలకులు అనుమతించిన వలసలు, వైదికమత వివక్షను భరించలేక క్రైస్తవం పుచ్చుకున్నవారు ఈ పెరుగుదలకు కారణం. శాతాలతో మోసం చేస్తున్నారు. రూపాయికి రూపాయి కలిపితే 100% పెరుగుదల. 1,000 కి 100 కలిపితే పెరిగేది 10%. 100 కంటే రూపాయి తక్కువ.

క్రైస్తవ మత పెరుగుదలను అరికట్టడానికి జాతీయ పౌరసత్వ, జాతీయ జనాభా జాబితాలను తయారుచేయమని, 1951 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరించమని సంఘ్ గొడవ చేసింది. 1961 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరిస్తే 80% కుకీలు పౌరసత్వం కోల్పోతారు. 1951 ఆధారం గా సవరిస్తే 95% కుకీలు, నాగాలు పౌరసత్వం కోల్పోయి రాష్ట్రాన్ని వదలాలి.
అల్లర్లలో 6,000 ఆయుధాలు భాండాగారాల నుండి చోరీ అయ్యాయి. ఒక్కటీ పట్టుబడలేదు. 1,000 ఆయుధాలే పోయాయని, 200 రికవరి చేశామని ముఖ్యమంత్రి అన్నారు. అల్లర్లు జరిగిన చురాచందపుర్ ప్రాంతంలోనే కాక రాష్ట్రమంతా చోరీలు జరిగాయి. చిన్న కారణాలకే సామాన్యులను చంపే పోలీసులు వీరిని ఎందుకు కాల్చలేదు? అన్ని స్టేషన్లలో భద్రతా రాహిత్యం, నిర్లిప్తత ఎలా వచ్చాయి? కేంద్ర, సైనిక, ప్రత్యేక దళాల భాండాగారాల జోలికి పోకుండా రాష్ట్ర రక్షణ దళాల భాండాగారాల నుంచే చోరీ జరిగింది. పాలకుల, అధికారుల మద్దతు లేనిదే ఇలా జరుగుతుందా? దోపిడీ ఆయుధాలు సంఘ్ సంస్థలకు చేరాయని అనుమానం.

మణిపూర్ కాలుతున్నప్పటి నుండి మణిపూర్ పాలక వర్గాలు 45 ట్వీట్లు చేశాయి. వాటిలో 13 మాత్రమే మణిపూర్‌కు సంబంధించినవి. మిగిలినవి కేంద్ర పాలకుల ట్వీట్ల రిట్వీట్లే. రాహుల్ గాంధీని ఎగతాళి చేసేవి, ఇందిర ఎమర్జెన్సీ, 1984 సిక్కుల ఊచకోత, 1985 షా బానో కేసు లింగ వివక్షల గురించిన విమర్శలే. రోమ్ కాలుతుంటే ఫిడేల్ వాయిస్తూ నీరో చక్రవర్తే వినోదించారు. నేటి ఇండియాలో సామంతులూ నీరోలే.చనిపోయిన వారిలో 98%, పారిపోయిన వారిలో 70% కుకీలు. 120 మంది చనిపోగా, 500 మంది గాయపడ్డారు. 20,000 ఇళ్ళు కూలాయి. 6,500 మంది పారిపోయారు. కుకీల ఆస్తులు, వాహనాలే బూడిదయ్యాయి. కుకీలను తీవ్రవాదులుగా చిత్రించి పాలక వర్గ అధికారులే చంపారు. 200 చర్చిలు, 17 గుళ్ళు, 124 గిరిజన గ్రామాలు, 1700ల కుకీల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. వీరు తిరిగి రావడానికి సైన్య సహాయం కోరుతున్నారు. ఒకప్పుడు వీరు సైనికులను అసహ్యించుకున్నారు. గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. ఈ అవకాశాలను దొరకపుచ్చుకొని మయన్మార్ సైనిక ఝుంఠా మణిపూర్‌లో చొరబడగలదు.

55 రోజుల నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళలు, క్రీడాకారులు, కళాకారులు, మేధావులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ, 550 మంది పౌర సమాజ ప్రతినిధులు, కేంద్ర పాలకులు జోక్యం చేసుకోవాలని, హత్యలను, హింసను, దమనకాండను ఆపాలని ఉత్తరాలు రాశారు. అయినా ప్రధాని, రాష్ట్రపతి పట్టించుకోలేదు. సుత్తి చేతిలో ఉన్నవాడికి ప్రపంచమంతా మేకే. బిజెపి పాలకుల వద్ద మతోన్మాద, అధికార, ధనబల, ప్రభుత్వ విభాగాల సుత్తులు ఉన్నాయి. సామాన్య ప్రజానీకం, గిరిజనులు, ముస్లింలు, క్రైస్తవులు వారికి మేకుల్లాగా కనిపిస్తున్నారు. అగ్ని ప్రమాదాన్ని ఆర్పచ్చు. రక్షకులే కాల్చితే ఆర్పేదెవరు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News