దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది ఎప్రిల్లో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్ను భారత క్రికెట్ బోర్డు నిరవధికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం భారత్లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో ఈసారి ఐపిఎల్ నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇలాంటి సమయంలో తమ దేశంలో ఐపిఎల్ నిర్వహించేందుకు తాము సిద్ధమేనని అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. యుఎఇ ఐపిఎల్కు ఆతిథ్యం ఇవ్వడం కొత్తకాదు. గతంలో కూడా ఓసారి ఇక్కడ ఐపిఎల్ను నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2014లో కొన్ని ఐపిఎల్ మ్యాచ్లను యుఎఇలో నిర్వహించారు. ఈసారి కూడా తాము ఐపిఎల్ను నిర్వహిస్తామని యుఎఇ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంతకుముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఐపిఎల్ నిర్వహణకు తాము సిద్ధమేనని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదనను తోసి పుచ్చింది. అంతేగాక యుఎఇ బోర్డు చేసిన ప్రతిపాదనపై కూడా బిసిసిఐ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, ఈసారి ఐపిఎల్పై బిసిసిఐ ఇప్పటికే ఆశలు వద్దుకుంది. కరోనా వల్ల నెలకొన్న అల్లకల్లోల వాతావరణం నేపథ్యంలో టోర్నీని నిర్వహించడం కంటే రద్దు చేయడమే మంచిదనే నిర్ణయంతో బిసిసిఐ ఉన్నట్టు తెలుస్తోంది.