పర్యావరణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
ముంబయి: ఆరే కాలనీలోని 800 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో కార్షెడ్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన ఆందోళనకారులపై కేసులను కూడా ఉపసంహరిస్తున్నట్టు థాకరే తెలిపారు. కార్షెడ్ ప్రాజెక్ట్ను కంజూర్మార్గ్కు షిఫ్ట్ చేస్తున్నట్టు తెలిపారు. కార్షెడ్కు సంబంధించిన అనిశ్చితి తొలగిపోయిందని థాకరే అన్నారు. ఆరేలో జీవ వైవిధ్యం ఆవశ్యకమని ఆయన అన్నారు. ముంబయికి ఇక సహజ అడవి సమకూరినట్టేనన్నారు.
గతేడాది సెప్టెంబర్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆరే ప్రాంతంలో కార్షెడ్ నిర్మించడానికి అక్కడి అడవిలోని 2700 చెట్లను నరికి వేసేందుకు నిర్ణయం తీసుకోగా పర్యావరణవేత్తలు వ్యతిరేకించి నిరసన తెలిపారు. ఆ సమయంలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరే నిరసనకారులకు మద్దతు తెలిపారు. దాంతో, ఎన్డిఎలో భాగస్వామ్య పక్షమైన శివసేనతో బిజెపి విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ తర్వాత అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాలేదు. చెరి సగం అధికారాన్ని పంచుకోవాలన్న శివసేన ప్రతిపాదనకు బిజెపి అంగీకరించకపోవడంతో కాంగ్రెస్, ఎన్సిపితో కలిసి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజా నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘ఆరే రక్షించబడింది’ అంటూ పర్యావరణశాఖమంత్రి ఆదిత్య థాకరే ట్విట్ చేశారు.