హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని, వారికి అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వింగ్ను ప్రారంభించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబర్ క్రైంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వింగ్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి విసి సజ్జనార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించని వారిని కనిపెట్టడం కష్టమని, అంతలా చొచ్చుకుపోయిందని అన్నారు. దానిని అవకాశంగా మల్చుకుని సైబర్ క్రైంలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకు సోషల్ మీడియా వింగ్ను ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలని, లేకుంటే సైబర్ నేరస్థుల బారిన పడుతారని అన్నారు.
అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైం, ఎకనామిక్ అఫెన్స్, క్రైం అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తదితర విభాగాలను ప్రారంభించామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా వింగ్ను ఆగస్టు,2014లోనే ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విభాగంలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారని, పోలీసుల నుంచి ప్రజలకు కావాల్సిన సూచనలు తీసుకుంటారని అన్నారు. వివిధ నేరాలను ఎలా అడ్డుకోవాలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. సోషల్ మీడియా వింగ్లో ఐదు టీములు పనిచేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ అండ్ రోడ్డు సేఫ్టీ టీం, సైబర్ క్రైం టీం, ఎకనామిక్ అఫెన్స్ టీం, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ, కమ్యూనిటీ ఔట్రిచ్ టీంలు పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డిసిపిలు ప్రకాష్ రెడ్డి, ఎస్ఎం విజయ్కుమార్, రోహిణిప్రియదర్శిని, పద్మజా, అనసూయ, వెంకటేశ్వర్లు, ఎడిసిపిలు లావణ్య, ప్రవీణ్కుమార్, ఇందిరా, మాణిక్రాజ్, ఎసిపి లక్ష్మినారాయణ, సంతోష్ కుమార్, శా్ంయబాబు, ఐటి సెల్ ఇన్స్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, సోషల్ మీడియా వింగ్ హెడ్ ఇన్స్స్పెక్టర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
VC Sajjanar launches social media wing