మనతెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్లో గుండెపోటుతో చనిపోయిన వరంగల్ విద్యార్థి మృతదేహం మంత్రి కెటిఆర్ చొరవతో ఏప్రిల్ 20న వరంగల్కు తరలించనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్కు చెందిన కాగిత సతీశ్ (26) ఉన్నత చదువుల కోసం గత ఏడాది ఆరంభంలో బ్రిటన్ వెళ్లాడు. గత ఆదివారం(ఏప్రిల్ 12) రాత్రి నిద్రలో ఉండగానే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈక్రమంలో ఏప్రిల్ 20న ఉదయం 2 గంటలకు ముంబై విమానాశ్రయానికి సతీశ్ మృతదేహం చేరుకుంటుందని అక్కడి నుంచి వరంగల్ చేరేలా సాయం చేయాలని వర్ధన్నపేట ఎంఎల్ఎ అరూరీ రమేశ్ మంత్రి కెటిఆర్ను కోరారు. దీనికి స్పందించిన కెటిఆర్ ఈ విషయమై మహారాష్ట్ర అధికారులను సంప్రదించాలని తన ఆఫీసుకు సూచించారు. అలాగే మహారాష్ట్ర డిజిపితో మాట్లాడాలంటూ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని కెటిఆర్ కోరారు. అంతా సవ్యంగా జరిగితే 20వ తేదీ రాత్రికల్లా కాగిత సతీశ్ మృతదేహం స్వస్థలానికి చేరే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. భారత్తోపాటు బ్రిటన్లోనూ లాక్డౌన్ అమల్లో ఉండటంతో ప్రయాణికుల విమానాలు నిలిచిపోయాయి. తమ కొడుకు మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని అతడి తల్లిదండ్రులు కెటిఆర్ను కోరారు.బ్రిటన్లోని తెలుగు సంఘాలు స్పందించి సాయం అందించడంతో అతడి భౌతిక కాయం ఏప్రిల్ 18న లండన్ నుంచి బయల్దేరి ఇస్తాంబుల్ మీదుగా వచ్చే కార్గో విమానంలో ముంబై చేరుకోనుంది.
Warangal Student dead body to reach Mumbai on April 20