మన తెలంగాణ/హైదరాబాద్ : రంజాన్ మాసం కారణంగా పేద ముస్లింలకు రేషన్, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సిఎం కెసిఆర్కు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని ముస్లింలు ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేసేవారు, రోజువారి కూలీలే ఎక్కువగా ఉన్నారన్నారు. వారికి పండగ సమయంలో ఆర్థిక సహాయం అవసరమని లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ మే ౩ వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో పేద ముస్లింలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతీ పేద ముస్లిం కుటుంబానికి రూ.500 నగదు, 500 విలువ చేసే రేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇఫ్తార్ విందు, దుస్తుల పంపిణీ కోసం వెచ్చిస్తున్న రూ.40 కోట్లు ఈ సారి రాష్ట్రంలోని నాలుగు లక్షల ముస్లిం కుటుంబాలకు సాయం చేసేందుకు వెచ్చించాలని సదరు లేఖలో సూచించారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు, బతుకమ్మ సందర్భంగా పేద హిందువులకు ఇతర వస్తువులకు బదులు నిత్యావసర సరుకులు పంచాలని కెసిఆర్ను అక్బరుద్దీన్ కోరారు.