Saturday, April 27, 2024

కాళేశ్వరంపై, నదీ జలాలపై మేం చర్చకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం మెుత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజా ధనం వృథా
సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం
కెసిఆర్ సభకు రావాలి.. గురువారం సాయంత్రం వరకైనా కెసిఆర్ సభకు వస్తే చర్చి చర్చిద్దాం
అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు
‘చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?’- కెసిఆర్‌పై రేవంత్ ఆగ్రహం
సభ నుంచి బిఆర్‌ఎస్ వాకౌట్

మన తెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య బుధవారం వాడీ వేడీ వాదనలు జరిగాయి. ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా సిఎం అభ్యంతర కర భాష వాడుతున్నారంటూ బిఆర్‌ఎస్ నేతలు లేవనెత్తగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నల్గొండ సభలో మాజీ సిఎం కెసిఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడొచ్చా అంటూ ప్రశ్నిం చారు. ఓ సీఎంను పట్టుకుని ’ఏం పీకనీకి పోయారా.?’ అని అంటారా అంటూ నిలదీశారు. ఇదేనా తెలంగాణ సంప్రదాయం, ఇది పద్ధతా.? అని మండిపడ్డారు. తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేదన్నారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా అని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగునీటిపారుదల శాఖ కోసం పని చేసిన కెసిఆర్, హరీశ్‌రావుకు పెత్తనం ఇస్తామని తెలిపారు. మేడిగడ్డలో నీరు నింపడం, అన్నారం, సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను అప్పగిస్తామని చెప్పారు. మేడిగడ్డ కుంగి, కుప్పకూలుతుంటే నీరు నింపడం ఎలా సాధ్యమని మండిపడ్డారు. కాళేశ్వరం మెుత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజా ధనం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పదే పదే బిఆర్‌ఎస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు. మాజీ సిఎం నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చి ద్దామా?. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి. కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం.’ అని స్పష్టం చేశారు. బొక్కబోర్లా పడ్డ బిఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని, కెసిఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని, చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ’ఇప్పటికే తెలంగాణ ప్రజలు కెసిఆర్ ఫ్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు పిల్లర్లే అయితే వాటి మీదైనా మాట్లాడేందుకు కెసిఆర్ సభకు రావాలి. గురువారం సాయంత్రం వరకైనా కెసిఆర్ సభకు వస్తే చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో సిఎం రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన భాష సరికాదంటూ సిఎం తీరను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

అధికారం నుంచి ప్రతిపక్షంలోకి మారినా బిఆర్‌ఎస్ నేతల బుద్ధి మారలేదు : రాజగోపాల్‌ రెడ్డి ఆరోపణ
అధికారం నుంచి ప్రతిపక్షంలోకి మారినా సదురు నాయకులకు బుద్ధి మారలేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రి మాట్లాడితే కెటిఆర్ కూర్చోమని అన్నారని మండిపడ్డారు. మార్పు కోసమే ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పించారని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే, కృష్ణా, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బిఆర్‌ఎస్‌కు ఆసక్తి లేదని, అందుకే సభ నుంచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్ సభ్యులు అన్నారు.

సభ్యులందర్నీ ఒకేలా చూడాలన్న కెటిఆర్
కడియం శ్రీహరిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తొలగించాలి
అంతకు ముందు కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని కెటిఆర్ అన్నారు. వాళ్లు 64 మంది ఉన్నారని, తాము 39 మంది ఉన్నామని అధికార పక్షం అడిగిన వెంటనే మైక్ కట్ చేయడం సరికాదన్నారు. కెసిఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. సభ్యులందరినీ ఒకేలా చూడాలని స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు.

కృష్ణా, గోదావరి జలాలపై శ్వేతపత్రంపై చర్చకు సిద్ధం : కడియం శ్రీహరి
అటు, కృష్ణా, గోదావరి జలాలపై శ్వేతపత్రంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, సిఎం రేవంత్ వాడే భాష పైనే తమకు అభ్యంతరం ఉందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అన్నారు. ’రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. సిఎంగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా నిండు సభలో సహనం కోల్పోతే ఎలా.?. సీఎం వాడరాని భాష వాడితే సరికాదు.’ అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొని తీవ్ర వాదోపవాదనలకు దారి తీసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News