Sunday, April 28, 2024

పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణాలకు అధికంగా నిధులు కేటాయిస్తాం

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలి
రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
రాష్ట్రంలో సిఐఆర్‌ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాల
భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు, నినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణాలకు అధికంగా నిధులు కేటాయిస్తామని, రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు, నినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పేర్కొన్నారు. నంది ఆవార్డుల ప్రధానంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని, ఎఫ్‌డిసి పరిధిలో ఉన్న భూములను సంరక్షిస్తామని వారు పేర్కొన్నారు. 2024-,25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఆ శాఖల ఉన్నత అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి కోమటిరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కేటాయింపులను పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పదిసార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని మంత్రి కోమటిరెడ్డి, ఆర్ధికమంత్రి భట్టి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రోడ్డు నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పిపిటీ రూపంలో వివరించారు.
ఆలైన్‌మెంట్‌కు జవాబుదారీగా ఉండాలి
ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కు సంబంధించి ఆలైన్‌మెంట్‌పై చర్చించారు. దీనిపై డిప్యూటి సిఎం భట్టి మాట్లాడుతూ భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఆలైన్‌మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆయన సూచించారు. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఆలైన్‌మెంట్ ఉండాలని భట్టి సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, నల్గొండ, హైదరాబాద్‌లో కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టడం, రాష్ట్రంలో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, వియూబీ బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించడం, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నెట్‌వర్క్ పెంచేందుకు అవసరమున్న నిధులు విడుదల చేయాలని చేసిన ప్రతిపాదనలను డిప్యూటి సిఎం భట్టి పరిశీలించారు. రాష్ట్రంలో సిఐఆర్‌ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్థికమంత్రి అంగీకారం తెలిపారు.
నంది అవార్డులపై కేబినెట్‌లో చర్చిస్తాం
ఇవే కాకుండా చేప ప్రసాదం పంపిణీ, బోనాల జాతర, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల ఏర్పాటుకు తాత్కాలిక అవసరాల కోసం కొంత బడ్జెట్ అవసరముంటుందని, అందుకు సరిపడా నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిని కోరారు. అనంతరం సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి సినిమాటోగ్రఫీ అధికారులను ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ వంటి మహమ్మారి వ్యసనాల వ్యతిరేక ప్రచారంలో సినిమా సెలబ్రిటీలు పాల్గొనే విధంగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. చలన చిత్ర పరిశ్రమ నటీ నటులకు అందజేసే నందిఅవార్డ్‌పై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయడానికి ఎదురవుతున్న ప్రతిబంధకాలను తొలగించాలన్నారు.
ఫిలింనగర్ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలి
ఫిలిం డెవలప్‌మెంట్ (ఎఫ్‌డిసి) పరిధిలో హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఉన్న భూములు ఆన్యాక్రాంతం కాకుండా సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సినిమా టికెట్ల కంటే థియేటర్‌లో అమ్మే చిరుతిళ్లకు వందరేట్ల వసూళ్లకు పాల్పడుతున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అన్ని మెట్రో నగరాల్లో అమలవుతన్న రేట్లకంటే హైదరాబాద్ సినిమాహాల్‌లో అమ్ముతున్న రేట్లు వందల శాతం ఎక్కువగా ఉన్నాయని దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఆన్‌లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయని వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుందామని కోమటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరి హరిత, డిప్యూటి సీఎం సెక్రటరి కృష్ణ భాస్కర్, ఈఎన్‌సిలు రవీందర్ రావు, గణపతిరెడ్డి, సతీష్ తో పాటు ఐఅండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News