Tuesday, May 21, 2024

సైబర్ నేరగాళ్ల ట్రాప్: యువతికి రూ. 79,500 టోపీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై చూసిన వెబ్‌సైట్ ద్వారా డ్రెస్‌ను కొనుగోలు చేసిన ఒక 23 ఏళ్ల యువతి సైబర్ నేరగాళ్ల మాయలో పడి రూ. 79,500 మోసపోయింది. ఆమె చేసిన తప్పంతా ఒక కొరియర్ కంపెకి చెందిన వెబ్‌సైట్‌పై తన వస్తువు డెలివరీ స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి ప్రయత్నించడమే.

తాను ఏ లింక్‌పైనా క్లిక్ చేయలేదని, రూ. 5ను ఆన్‌లైన్ చెల్లించాలని కోరినా తాను ఆ పనిచేయలేదని సమపికా రాయ చౌదరి చెప్పారు. అయితే తన వస్తువు డెలివరీ స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించినపుడు తన అకౌంట్‌లో నుంచి డబ్బు మాయమైందని ఆమె చెప్పారు.

ఆగస్టు 10న ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై కనిపించిన వెబ్‌సైట్ నుంచి రూ. 1,999 ఖరీదు చేసే డ్రెస్ కోసం ఆర్డర్ చేశానని ఆమె చెప్పారు. ఈ రోజు పార్సిల్ డెలివరీ అవుతున్నట్లు తనకు ఆగస్టు 14న ఒక ఈమెయిల్ వచ్చిందని ఆమె తెలిపారు. మెయిల్‌లో ఒక ప్రముఖ కొరియర్ కంపెనీకి చెందిన ట్రాకింగ్ ఐడి కూడా ఉంది. డెలివరీ స్టేటస్ కోసం ఐడిని ఉపయోగించవచ్చని అందులో రాసి ఉందని రాయ్ చౌదరి శుక్రవారం చెప్పారు.

కొరియర్ కంపెనీ వెబ్‌సెట్‌ను ఓపెన్ చేసి ఐడి ద్వారా పార్సిల్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించాను. అయితే స్టేటస్ నాట్ నోన్ అంటూ మెసేజ్ కనిపించింది. అయితే అదే సమయంలో మీ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసినట్లు నాకు ఒక మెసేజ్ వచ్చింది. త్వరలోనే మా డెలివరీ ఏజెంట్ మిమల్ని సంప్రదిస్తారు అని ఆ మెసేజ్‌లో ఉందని ఆమె చెప్పారు.

డెలివరీ ఏజెంట్‌గా పరిచయం చేసుకుంటూ ఒక వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, పొరపాటున మీ పార్సిల్ దారిమళ్లిందని, ఒక లింకును క్లిక్ చేసి రూ. 5 చెల్లించాలని ఆ వ్యక్తి చెప్పాడు. అందుకు నేను నిరాకరించాను. ఆ వ్యక్తి నాకు మరో ఆప్షన్ ఇచ్చాడు. ఒక నంబర్ ఇచ్చి ఇది మరో డెలివరీ ఏజెంట్ నంబరని, ఆ వ్యక్తికి హై అని మెసేజ్ పంపాలని చెప్పాడు. పార్సిల్ డెలివరీ అయిన తర్వాత రూ. 5 ,చెల్లించవచ్చని ఆ వ్యక్తి చెప్పాడు. ఈ ఆఫర్‌ను కూడా నేను తిరస్కరించాను. చివరకు..మీ వాట్సాప్‌కు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందని, దాన్ని తనకు షేర్ చేయాలని ఆ వ్యక్తి చెప్పాడు. అందుకు అంగీకరించి కోడ్‌ను ఆ వ్యక్తికి షేర్ చేశాను. ఇదంతా నేను ఇంట్లో లేని సమయంలో జరిగింది. నేను ఇంటికి తిరిగివచ్చేసరికి పార్సిల్ డెలివరీ అయిపోయింది. నాకు ఎటువంటి కాల్ రాలేదు.. అని ఆమె వివరించారు.

మూడు రోజుల తర్వాత గురువారం తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 79,500 డెబిట్ అయినట్లు తన బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని ఆమె చెప్పారు. అసలు ఆ డబ్బు తన ఖాతా నుంచి ఎందుకు, ఎలా డెబిట్ అయిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తెలిపారు. నింతా పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆగస్టు 14 నుంచి 17 వరకు రాయ్ చౌదరి ఫోన్‌లో ఎటువంటి అసాధారణ కార్యకలాపాలు జరగలేదని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఆమె తన వాట్సాప్‌కు వచ్చిన కోడ్‌ను షేర్ చేయడ కారణంగానే బ్యాంకు నుంచి డబ్బు మాయం అయ్యే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News