దుబాయి: మహిళల ట్వంటీ ప్రపంచకప్ 2022 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. న్యూజిలాండ్ వేదికగా 2022లో ఈ వరల్డ్కప్ జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ వరల్డ్కప్ 2021లోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా దీన్ని ఏడాది పాటు వాయిదా వేశారు. తాజాగా ఈ వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసిసి ప్రకటించింది. 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ మెగా చాంపియన్షిప్ జరుగనుంది. ఈ టోర్నీలో 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మొత్తం 31 మ్యాచ్లను నిర్వహిస్తారు. ఆరు మైదానాల్లో ఈ టోర్నీ జరుగనుంది. ఆక్లాండ్, తారంగా, హామిల్టన్, వెల్లింగ్టన్, డునెదిన్ నగరాల్లో ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతాయి.
ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు క్వాలిఫయర్ టీమ్తో తలపడుతుంది. న్యూజిలాండ్ ఈ వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధిస్తుండగా ర్యాంక్ల ద్వారా ఇతర జట్లను ఖరారు చేస్తారు. దీని కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్లను నిర్వహిస్తారు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్కు అనూహ్య స్పందన లభించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. ఇక కివీస్ వేదికగా జరిగే వరల్డ్కప్ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారు.