సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో తాను కెప్టెన్సీ గురించి ఆందోళన పడడం లేదని వైస్ కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. తాను తొలి టెస్టులో సారధి విరాట్కు ఎలా సహకరించాలనే దానిపైనే దృష్టి పెట్టానన్నాడు. ఇక మిగిలిన మూడు టెస్టు మ్యాచ్ల గురించి ఇప్పుడే ఆలోచించడం మంచిది కాదన్నాడు. మొదటి టెస్టు మిగిసిన తర్వాతే దాని గురించి మాట్లాడితే మంచిదన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం తమకు సవాలు వంటిదేనన్నాడు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న తమకు కూడా మెరుగైన అవకాశాలున్నాయన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలకడగా ఆడిన జట్టుకే విజయం లభిస్తుందన్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. దీంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమన్నాడు. కాగా, కోహ్లి అందుబాటులో లేకుంటే తనపై ఒత్తిడి పెరగడం సహజమేనన్నాడు. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైన తట్టుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రహానె పేర్కొన్నాడు.