Tuesday, May 7, 2024

క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

- Advertisement -
- Advertisement -

దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి
8వ జాతీయ రోజ్ గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసి,దేశ సమగ్రత, సమైక్యతను కాపాడాలని, తద్వారా దేశ సేవలో భాగస్వామ్యులు కాబోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశ రక్షణకు మీరు అంకితం కాబోతున్నారని, నేటి నుంచి మీరు అంకితభావంతో పని చేస్తూ ఉన్నతమైన వ్యక్తులుగా పేరుతెచ్చుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. హకీంపేట్ సిఐఎస్‌ఎఫ్, ఎన్‌ఐఎస్‌ఏ అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ ‘రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. సిఐఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి రంగాల్లో మొత్తం 4 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ రోజ్‌గార్ మేళాలో భాగంగా నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశం ఈ రోజు శాస్త్రసాంకేతిక రంగాల్లో అమెరికాతో పాటు సమాన గౌరవాన్ని పొందుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దానికి ఉదాహరణే ఇటీవల జాబిల్లిపై చంద్రాయాన్‌పై అడుగు పెట్టడమే అన్నారు. అందుకే యువతకు సాధికారత కల్పించడం ద్వారా నాటి వైభవాన్ని పున:ప్రతిష్టించుకునేందుకు ప్రధానమంత్రి మోదీ సంకల్పించారన్నారు. మన దేశానికి ఉన్న ప్రత్యేకత మన యువబలం. యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనేది ప్రధాని ఆలోచన అని మంత్రి తెలియజేశారు. దీనికి తగ్గట్లుగానే 9 ఏళ్లుగా.. ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు.

వచ్చే 25 ఏళ్ల కాలం ‘అమృత కాలం’ అని, భారతదేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయమని కేంద్రమంత్రి ఈ సందర్భంగా యువతకు తెలిపారు. ఈ సమయంలో..మనలోని బానిస ఆలోచనలను తొలగించుకుని కేవలం జాతీయవాద భావనను మదిలో నింపుకుని యువత ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఓవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని అందిస్తూ.. ఉద్యోగాల కోసం వేచి చూసే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రధానమంత్రి యువతను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారని తెలుపుతూ ప్రతి నెల 50 నుంచి 70వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తూ ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.

నేడు జరిగిన రోజ్‌గార్ మేళా ఎనిమిదొవదని, ఇవాళ్టి కార్యక్రమంతో కలుపుకుని మొత్తంగా 5.5 లక్షలకు పైగా మందికి నియామక పత్రాలు అందించామని, మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిత సమయంలో చేరుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి తీసుకొచ్చామని, అదే సమయంలో ఎన్‌ఈపి-2020 ద్వారా విద్యావిధానంలో నైతికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇలా ఈ తొమ్మిదేళ్లలో చాలా మార్పులు వచ్చాయని, వచ్చే 25 ఏళ్ల అమృతకాలంలో.. మీరు మరింతగా శ్రమించి పనిచేస్తే.. భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సునీల్ ఇమ్మన్యూయల్ , డైరెక్టర్, ఎన్‌ఐఎస్‌ఏతో పాటు సిఐఎస్‌ఎఫ్, సిఆర్‌పి్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Rojgar Mela 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News