Wednesday, May 15, 2024

ఢిల్లీలో మరోసారి యమున మహోగ్రరూపం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకర స్థాయి ( 205.33 మీటర్లు)ని దాటింది. దీంతో మరోసారి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నది లోకి నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నదిలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది.ఢిల్లీ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక , పునరావాస కార్యక్రమాలపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

“హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీ లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ” అని ఢిల్లీ మంత్రి అతిషీ వెల్లడించారు. గత వారం వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం అత్యధికంగా 208.05 మీటర్లకు చేరింది. గత కొద్ది రోజులుగా నీటి మట్టం 205.02 మీటర్లుగా ఉంది. తాజాగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆదివారం ఉదయం 206.07 మీటర్లకు చేరుకుంది. మరోవైపు జులై 25 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, సహా యమునా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు తలెత్తాయి. వరదల కారణంగా 27,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News