Saturday, April 27, 2024

వెస్టిండీస్‌తో టి20 సిరీస్.. తేలిపోతున్న భారత కుర్రాళ్లు

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించడంలో విపలమైంది. ఈ మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. యువ ఆటగాళ్లకు పలు అవకాశాలు లభిస్తున్నా వారు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ తదితరులకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లను టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు.

రానున్న టి20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన జట్టును తయారు చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌లోనూ యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కుర్రాళ్లు విఫలమవుతున్నారనే చెప్పాలి. వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు తొలి టి20లో విఫలమయ్యారు. వీరు మెరుపులు మెరిపిస్తారని ఆశించగా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. వీరు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది. దాన్ని తట్టుకోవడంలో వారు విఫలమయ్యారు.

దీంతో టీమిండియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఆరంగేట్రం మ్యాచ్ ఆడిన తిలక్‌వర్మ ఒక్కడే ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక సిరీస్‌లో సీనియర్లుగా పరిగణిస్తున్న సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్య, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ తదితరులు ఘోరంగా విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడింది. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొలేక పోయారు. వీరు విఫలం కావడంతో అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలు కాక తప్పలేదు.

తీరు మారాల్సిందే..
యువ ఆటగాళ్లకు పలు అవకాశాలు లభిస్తున్నా వారు మాత్రం తమ ఆట తీరును మెరుగుపరుచుకోలేక పోతున్నారు. సంజు శాంసన్, సూర్యకుమార్‌లకు ఇప్పటికే ఎన్నోసార్లు ఛాన్స్ లభించింది. అయినా వీరి ఆటతీరు ఏమాత్రం మెరుగుపడడం లేదు. రానున్న రెండు వరల్డ్‌కప్‌ల నేపథ్యంలో సూర్యకుమార్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ తదితరులు జట్టుకు చాలా కీలకం. అయితే వీరు మాత్రం తమ బ్యాటింగ్ తీరును మార్చుకోలేక పోతున్నారు.

ఇలాగే ఆడితే రానున్న రోజుల్లో వీరికి టీమిండియాలో చోటు కాపాడు కోవడం చాలా కష్టమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న హార్దిక్ పాండ్యలో కూడా మునుపటి జోష్ కనిపించడం లేదు. వన్డేలతో పాటు తొలి టి20లో అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. మిగిలిన నాలుగు టి20లలోనైనా హార్దిక్ జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News