మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ నార్త్ లాలాగూడా ప్రాంతానికి చెందిన ముత్యాలు తన సొంత అన్మ శంకర్ నుంచి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ బుధవారంన నాడు హెచ్ఆర్సిని ఆశ్రయించాడు. అన్న శంకర్కు, తనకు రెజిమెంటల్ బజార్ దర్గా ప్రాంతంలో 54 గజాల ఉమ్మడి స్థలం ఉందని, అందులో తన సోదరుడు తన అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టాడని తెలిపాడు.ఈ విషయమై అన్నను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశాడని కమిషన్కు తెలిపాడు. ఈక్రమంలో మున్సిపల్, గోపాలపురం పోలీస్ అధికారులను ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని వివరించాడు. దీంతో హెచ్ఆర్సిని ఆశ్రయించినట్లు తెలిపాడు. తన సోదరుడు శంకర్ చేపడుతున్న నిర్మాణం నిలిపేయాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లెక్కచేయకుండా నిర్మాణం చేస్తున్నాడని ఆరోపించాడు. కోర్టులో కేసు వేసినందుకు తనను, తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించి తన అన్నకు మద్దతుగా నిలుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సిలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నాడు.