* సిఎం కెసిఆర్తో బాలయ్యకు ప్రత్యేక అనుబంధం
* తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలోనూ భాగస్వామ్యం
* తెలంగాణ రాష్ట్రం గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది
* రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సంతాపం
సిద్దిపేట: అంతర్జాతీయ బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య బుధవారం అనారోగ్యం కారణంగా సిద్ధిపేటలో మృతి చెందారు. అనేక చిత్రాలతో సిద్ధిపేటకు వన్నె తెచ్చిన ఆయన మరణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట బిడ్డగా.. సిద్దిపేట కీర్తిని బాతిక్ చిత్రాల ద్వారా ఖండాంతరాలు దాటించిన గొప్ప కళాకారుడు బాలయ్య అని ఆయన సేవలను కొనియాడారు. సీఎం కేసీఆర్తో ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విగ్రహ రూపకల్పనలోనూ బాలయ్య భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి 2016లో తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఉత్తమ అవార్డును అందజేశారని తెలిపారు. బాతిక్ చిత్రకారుడిగా రాష్ట్రపతి అవార్డును సైతం అందుకున్నారని అన్నారు. తుది శ్వాస వరకు చిత్రాలు వేసి ఆయన చిత్రకళపై ఉన్న ప్రేమను చాటుకున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన అందించిన సేవలను సిద్దిపేట గడ్డ మరువదన్నారు.
మంజీరా రచయితల సంఘం సంతాపం
సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య మృతి పట్ల మంజీరా రచయితల సంఘం, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రగాడ సంతాపం ప్రకటించాయి. బాతిక్ బాలయ్య, కాపు రాజయ్య ప్రేరణతో చిత్రకళా రంగంలో సిద్దిపేట ఎంతో ఖ్యాతి సాధించిందని తెలిపారు. సిద్దిపేట గడ్డ గొప్ప కళాకారున్ని కోల్పోయిందని అన్నారు. ప్రజాకవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని సిథారెడ్డి ప్రముఖ గాయకుడు కవి దేశపతి శ్రీనివాస్, మరసం అధ్యక్షులు రంగాచారి, ప్రధాన కార్యదర్శి సిద్దంకి యాదగిరి, మీడియా అకాడమీ సభ్యులు కే. అంజయ్య, పెద్ది సుభాస్ తదితరులు సంతాపం ప్రకటించారు.
Batik Artist Yasala Balaiah Passed Away