Sunday, April 28, 2024

ఉద్దండులతో యువ కెరటాల ఢీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రత్యర్ధులను ఢీకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో ప్రధాన పార్టీలు ఈసారి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఆరు నియోజకవర్గాల్లో 30 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్ధులను ప్రకటించాయి. వారంతా సమీప ప్రత్యర్థులను ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్‌ఆర్‌ఐ ఝూన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డి 26 ఏళ్ల వయస్సులో బరిలో నిలిచి రాజకీయ ఉద్ధండులు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు దీటుగా సవాల్ విసురుతున్నారు. 2018లో బిటెక్ పూర్తి చేసిన ఆమె ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజేందర్‌రెడ్డిపై పోటీ చేస్తున్నారు. 30 సంవత్సరాలున్న ఆమె డిగ్రీ పూర్తి చేసి తన తాత చిట్టెం నర్సిరెడ్డి, తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొంటూ ఓటర్ల ఆశీస్సులు కోరుతున్నారు.

మాజీ మంత్రి డికె అరుణకు స్వయానా మేనకోడలు కావడంతో కచ్చితంగా విజయం సాధిస్తాచంగలనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి ఉష బహుజన సమాజ్ వాది పార్టీ నుంచి ఎన్నికల సమరంలో సీనియర్ నేత దాసరి మనోహర్‌రెడ్డిపై తలపడుతున్నారు. 27 ఏళ్ల ఉష 2018లో ఖరగ్‌పూర్ ఐఐటీలో బిటెక్ పూర్తి చేశారు. దళిత మేధావి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి బడుగు,బలహీన వర్గాల కోసం సేవ చేస్తామని ప్రచారంలో పేర్కొంటూ ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పోటీలో ఉన్నారు. 26 ఏళ్ల రోహిత్ ఎంబిబిఎస్‌పూర్తి చేసి తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు బాటలో నడుస్తూ పేదలకు ప్రజాప్రతినిధిగా ఎన్నికై సేవలందిస్తానని పేర్కొంటున్నారు. డాక్టర్ వృత్తి వదిలి ప్రజా సేవకు సిద్ధం కావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.

హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున వడితెల ప్రణవ్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై ఎన్నికల పోరులో కాలు దువ్వుతున్నారు. 30 సంవత్సరాల ప్రణవ్ బిటెక్ పూర్తి చేసి రాజకీయాల ద్వారా పేదలను అన్ని విధాలుగా అభివృద్ది చేయవచ్చనే లక్షంతో ముందుకు వెళుతున్నాడు. ఈసారి నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించాలని కోరుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా సామాజిక మాధ్యమాల్లో కనిపించే కర్నె శిరీష యాదవ్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్‌రెడ్డికి పోటీగా నిలిచారు. 25 సంవత్సరాల శిరీష పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో నాలుగు గేదెలను పోషిస్తూ, చదువుకుంటే డిగ్రీలు తప్ప ఉద్యోగాలు రావని, నేటి యువత సొంతంగా వ్యాపారాలు చేయాలని సోషల్ మీడియా ద్వారా యువ సమాజానికి సందేశాలు పంపుతున్నారు. నియోజకవర్గం ప్రజలు ఈసారి తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News