Wednesday, May 1, 2024

కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

మక్తల్ : రోడ్డు పక్కన గల డబ్బా షెడ్‌కు కరెంటు సరఫరా కావడంతో మక్తల్ పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన కర్రెం తిమ్మప్ప(31) అనే యువకుడు ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కేశవనగర్‌కు చెందిన తిమ్మప్ప గత కొంతకాలంగా పట్టణంలోని టెంట్ హౌస్‌లో కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పట్టణంలో వర్షం కురుస్తుండడంతో నారాయణపేట క్రాస్ రోడ్డు వద్ద గల మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్లి ఇనుప కడ్డీకి ఆనుకుని నిలబడ్డాడు. అయితే కడ్డీకి ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో తిమ్మప్ప షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కర్రెం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు. తిమ్మప్ప మృతి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కేశవనగర్‌లోని తిమ్మప్ప ఇంటికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News